పౌరసత్వ మంట: ఎమర్సెన్సీ..: కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతోంది. న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం 7:30 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. హోం మంత్రి అమిత్ షా హాజరు కావట్లేదని తెలుస్తోంది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సహా దాదాపు అన్ని స్థాయిల అధికారులు ఇందులో పాల్గొనననున్నారు.

ఈశాన్యం నుంచి అంటుకున్న నిరసన జ్వాల
పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు కాస్తా చట్టంగా రూపుదాల్చినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా ఒకే తరహా హింసాత్మక పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ వస్తోంది. ఈశాన్యంలోని అస్సాం, త్రిపురల్లో చెలరేగిన హింస.. క్రమంగా పశ్చిమ బెంగాల్ కు విస్తరించింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ లో చెలరేగిపోయారు ఆందోళనకారులు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం వ్యతిరేకంగా ఉండటాన్ని ఆందోళనకారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. భారీ ఎత్తున హింసకు తెర తీశారు.

ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాని స్థితి..
ఈ పరిస్థితులు ఈశాన్య రాష్ట్రాలకో, పశ్చిమ బెంగాల్ కో పరిమితం కాలేదు. దేశ రాజధానిని చుట్టుముట్టాయి. రాత్రనక, పగలనక ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలను చేపట్టారు. జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సైతం ఉద్యమంలో దిగడంతో పరిస్థితులు మరింత విషమించాయి. అదే సమయంలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జీ చేయడం, క్యాంపస్ లో ప్రవేశించడం వంటి పరిణామాలు.. అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. లాఠీ ఛార్జీ పట్ల దేశంలో ఉన్న అన్ని జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఒక్కటయ్యాయి. నిరసన ప్రదర్శనలకు దిగాయి.

ఉత్తర్ ప్రదేశ్ లో తొలిసారిగా..
గురువారం నాటికి ఈ హింసాత్మక పరిస్థితులు ఉత్తర్ ప్రదేశ్ లో కనిపించాయి. పెద్ద ఎత్తున హింసకు దారి తీశాయి. రాజధాని లక్నో సహా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి దిగారు. సంబల్ లో ఉత్తర్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులను తగుల బెట్టారు. పలు బైకులు, కార్లకు నిప్పు పెట్టారు. న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళలల్లో ఇదే తరహా వాతావరణం కనిపించింది. పరిస్థితి మొత్తాన్నీ మొదటి నుంచీ గమనిస్తూ వస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు అప్రమత్తమైంది. అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా..
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకోవడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, అస్సాంలల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇదివరకే సూచనప్రాయంగా వెల్లడించాయి కూడా. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి దిగే స్థాయిలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరిచుకుంది.

అన్ని రాష్ట్రాల నుంచీ నివేదికలు..
ప్రస్తుతం అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాల నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక నివేదికలను తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, పోలీసు ఉన్నతాధికారుల నుంచి వేర్వేరుగా నివేదికలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులకు అందినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారని, అనంతరం అమిత్ షా కు తమ అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక రిపోర్ట్ ను అందజేస్తారని చెబుతున్నారు. ఈ అత్యవసర సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారని తెలియ రాలేదు.












Click it and Unblock the Notifications