బెంగళూరు యశ్వంత్ పుర మార్కెట్ యార్డ్ లో డీకే శివకుమార్ ఆకస్మిక తనిఖీ- టీ, టిఫన్ అక్కడే
బెంగళూరు యశ్వంత్పూరలో గల మార్కెట్ యార్డ్ ను ఈ ఉదయం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక వ్యాపారులు, రైతుల కష్టసుఖాలను నేరుగా తెలుసుకోవడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు. మార్కెట్లో కలియదిరిగారు. రైతులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతోన్న గిట్టుబాటు ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలతో ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ అక్కడే రోడ్ సైడ్ హోటల్ లో టిఫిన్ చేశారు. మార్కెట్ యార్డ్ కూలీలతో కలిసి వేడి వేడి ఇడ్లీ, సాంబార్ తిన్నారు. టీ తాగారు. బిల్లుగా రూ. 500 ను ఇచ్చి, అక్కడ టిఫన్ చేసిన వారి నుంచి డబ్బులు తీసుకోవద్దని హోటల్ యజమానికి చెప్పారు. అల్లం, వెల్లుల్లి, బంగాళాదుంపలు, ఉల్లిపాయ మండీలను సందర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అక్కడ ఉల్లిపాయల బస్తాలపై కూర్చొని రైతులతో ముచ్చటించారు. వారి భుజాలపై చెయ్యి వేసి ఆత్మీయుడిలా కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు

ఆ తనిఖీల్లో భాగంగా బంగాళాదుంప మండీకి వెళ్లిన డీకే శివకుమార్ అక్కడ వ్యాపారం చేసుకునే ఓ మహిళతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. నెలకు రూ. 2,000 నగదు అందుతోందని, ఉచిత కరెంట్ కూడా వస్తోందని చెప్పారు. ఇవన్నీ కూడా సిద్ధరామయ్యే చేశారని ఆమె బదులివ్వడం కనిపించింది. తన కుటుంబం ఇందిరా గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తోందని ఆమె బదులిచ్చారు.

ఆ సమాధానం విన్నాక డీకే శివకుమార్ నవ్వుతూ.. 'మరి నేనెవరో మీకు తెలుసా?' అని అడిగారు. దానికి ఆమె అమాయకంగా 'తెలియదు స్వామి..' అని చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. ఆ మహిళ నిష్కల్మషమైన సమాధానానికి డీకే శివకుమార్ నవ్వుతూ తన గురించి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన వెల్లుల్లి, కొబ్బరి మండిలను కూడా సందర్శించి అక్కడి విక్రయదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఆరు శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నట్లు మహిళా వ్యాపారి ఒకరు వివరించారు.
ఈ ఆకస్మిక పర్యటనలో రైతులు తమను వేధిస్తున్న పలు సమస్యలను డీకే శివకుమార్ దృష్టికి తెచ్చారు. కొంతమంది దళారులు, వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా 65 కిలోల బరువు ఉండే బస్తాలను కేవలం 50 కిలోలుగానే లెక్కగడుతున్నారని ఓ రైతు వాపోయారు. అలాగే మార్కెట్లో సరైన నిఘా అధికారులు లేకపోవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కో విధమైన ధరలను నిర్ణయిస్తున్నారని వివరించారు.
చిత్రదుర్గ నుంచి కూరగాయలు విక్రయించడానికి వచ్చిన రైతులతో డీకే శివకుమార్ కాసేపు మాట్లాడారు. ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతోంది, అందులో రైతులకు ఎంత లాభం దక్కుతోంది వంటి సమాచారాన్ని సేకరించారు. చెల్లకెరెకు చెందిన రైతు తన ఇంట్లో విద్యుత్ సరఫరా సరిగా లేదని, పొలం వద్ద చిన్న ఇల్లు కట్టుకున్నా రోడ్డు సౌకర్యం లేదని చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీకే శివకుమార్.. స్థానిక గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ రైతు మొబైల్ నంబర్ తీసుకున్నారు.













Click it and Unblock the Notifications
