అమీర్ఖాన్ 'పీకే' చూసిన సాధువులు, భగ్గుమన్న 'కంప్యూటర్ బాబా'
ఇండోర్: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం పైన విమర్శలు ఆగడం లేదు. మధ్యప్రదేశ్లో కొందరు సాధువులు కలిసి ఈ సినిమాను చూశారు. అలా చూసిన వారిలో కంప్యూటర్ బాబా అనే సాధువు కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని చూసిన అనంతరం ఆ కంప్యూటర్ బాబా మండిపడ్డారు.
ఇండోర్లోని ట్రెజర్ ఐలాండ్ మాల్ మల్టీప్లెక్స్లో సినిమాను వారు చూశారు. మధ్యప్రదేశ్ సర్కారు, సెన్సార్ బోర్డు ఈ సినిమా నిలిపివేతకు చర్యలు తీసుకోకుంటే రాష్ట్రంలో తాము తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. హిందువులను అవమానించేందుకు ఈ సినిమాలో తీవ్రంగా ప్రయత్నించారని మండిపడ్డారు.
ఈ సినిమా ద్వారా హిందూమతాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతామని చెప్పారు. 35 మంది సాధువులు ఆదివారం నాడు ఈ సినిమాను వీక్షించారు.
కాగా, అమీర్ ఖాన్, అనుష్క శర్మ నటించిన పీకే చిత్రం పైన హిందుత్వ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిషేధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. హిందుత్వ సంస్థలతో పాటు ముస్లీం మత పెద్దలు కూడా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లో ఈ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్ల పైన దాడులు జరిగాయి.