హైకమాండ్కు బిగ్ షాక్: చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరణ
Lok Sabha elections 2024: దేశవ్యాప్తంగా మూడో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమాయాత్తమౌతోన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మొన్నటికి మొన్న గుజరాత్లోని సూరత్కు చెందిన పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, ఆ వెంటనే ఆయన భారతీయ జనత పార్టీలో చేరడం చకచకా జరిగిపోయింది.
ఇప్పుడు మళ్లీ అలాంటి ఉదంతమే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. ఈ మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి..నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో అక్షయ్ వెంట బీజేపీ శాసన సభ్యుడు రమేష్ మెండోలా ఉన్నారు.

నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్న కొద్దిసేపటికే ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారు మధ్యప్రదేశ్ పార్టీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్వర్గీయ. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. గతంలో అక్షయ్తో ఒకే కారులో ప్రయాణించినప్పుడు తీసుకున్న ఫొటోను తన ట్వీట్కు జత చేశారు.
అక్షయ్ తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడంతో ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి లేకుండా పోయారు. గెలిచే సత్తా ఉన్న స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఆయన తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ నాటికే నామినేషన్లను దాఖలు చేసే గడువు ముగిసింది.
ఇండోర్.. బీజేపీకి గట్టిపట్టు ఉన్న నియోజకవర్గం. లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ సొంత నియోజకవర్గం ఇది. వరుసగా ఎనిమిది సార్లు ఆమె ఇక్కడి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో శంకర్ లల్వాణి ఇండోర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆయనే పోటీలో ఉన్నారు.
గట్టి పోటీ ఇస్తాడనుకున్న అక్షయ్ తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదివరకు సూరత్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థిగా నీలేష్ కుంభానీ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే ఆయన బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications