కర్ణాటకలో ఎవరికెన్ని?.. టగ్ ఆఫ్ వార్ తప్పదా?: పబ్లిక్ టీవి సర్వే
బెంగళూరు: కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది సర్వేలు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటిదాకా వెల్లడైన సర్వేలన్ని ఎక్కువ శాతం 'హంగ్' ఏర్పడుతుందని చెప్పగా.. తాజాగా వెల్లడైన పబ్లిక టీవి సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. 223 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 113 ఎవరికీ రాదని తేల్చింది.
Recommended Video
ఎవరికెన్ని సీట్లు:
పబ్లిక్ టీవి సర్వే ప్రకారం.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 89-94, బీజేపీ 86-91, జేడీఎస్ 38-43 సీట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉందని తేలింది. అంటే, కాంగ్రెస్ పార్టీకి 36శాతం ఓట్లు, బీజేపీకి 33శాతం ఓట్లు, జేడీఎస్ 23శాతం ఓట్లు, ఇతరులు 8శాతం ఓట్లు గెలుచుకుంటారని సర్వే చెబుతోంది. ఈ లెక్కన కాంగ్రెస్-బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదని అర్థమవుతోంది.
పాపులర్ పథకం అదే..:
మొత్తం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హంగ్ తప్పదని సర్వే తేల్చింది. ఇకపోతే కర్ణాటకలో అత్యంత పాపులర్ పథకంగా సిద్దరామయ్య 'అన్నభాగ్య' పథకాన్ని ఎక్కువమంది సర్వేలో ప్రశంసించారు. అదే సమయంలో లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించడంపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి.
బెంగళూరులో ఎవరికెన్ని?:
సర్వే నివేదిక ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు నగరంలో అత్యధిక సీట్లు దక్కనున్నాయి. బెంగళూరులో కాంగ్రెస్ 14 స్థానాలు, బీజేపీ12, జేడీఎస్ 1 స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సర్వే చెబుతోంది. అంతకుముందు ఇండియా టుడే వెల్లడించిన సర్వేలో.. బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందని తేలింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధిగమించడానికి అది సరిపోదని వెల్లడించింది.
ఇండియా-టుడే కార్వీ:
ఇండియా టుడే కార్వీ ఒపీనియన్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి 90-101సీట్లు దక్కనున్నాయి. అదే సమయంలో బీజేపీ ఓటు బ్యాంకు కూడా కాస్త మెరుగుపడి, 78-86స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. ఇక జేడీఎస్ 34-43స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. కాగా, మే 12న కర్ణాటక వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే15న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య పదవీకాలం మే 24తో ముగుస్తుంది.