2019 ఎన్నికలే లక్ష్యంగా: మధ్యతరగతి ప్రజలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అజెండా
దేశవ్యాప్తంగా జరిగిన జరగబోయే ఎన్నికలు 2019 లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్నాయి ప్రధాన రాజకీయపార్టీలు. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి ఆయా పార్టీలు. ఇందులో భాగంగానే ఈ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా సరే గెలవాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నాయి పార్టీలు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వారికోసం మంచి ప్రణాళిక రూపొందించే పనిలో పడింది హస్తం పార్టీ.
మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు
మధ్య తరగతి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వారి మన్ననలు పొందేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు ముందుకేస్తోంది. మధ్యతరగతి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై దృష్టి సారించింది హస్తం పార్టీ. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ల సహాయ సహకారాలు తీసకోనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రఘురాం రాజన్ లాంటి వ్యక్తులను కాంగ్రెస్ వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సేవలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వినియోగించుకుంటున్నట్లు సమాచారం. భవిష్యత్తులో కూడా వీరినుంచి అవసరమయ్యే ఐడియాలను తీసుకోవాలని భావిస్తోంది.
ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ పేరుతో ప్రత్యామ్నాయ అజెండా
పలువురి వక్తలు, ఆయా రంగాల నుంచి నిపుణుల ఆలోచనలు తీసుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ పేరుతో ఒక సంస్థను స్థాపించింది. ఇందులో వక్తలు, ప్రముఖులు తీసుకురావడం, ప్రజలకు ఇందులో భాగస్వామ్యం చేసి వారి ఆలోచనలు తీసుకోవడం వంటివి చేస్తారు. ఏఐపీసీ కొద్ది రోజుల క్రితమే దీనిపై చర్చించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ను ఆహ్వానించింది. ఏఐపీసీ నవంబర్ 30వ తేదీన ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ప్రముఖ డాకటర్లను, ఇంజినీర్లను, మేనేజర్లను, న్యాయ వ్యవస్థ, ఆర్థిక నిపుణులను ఆహ్వానించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పి. చిదంబరం, కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, రణదీప్ సూర్జేవాలా, సల్మాన్ ఖుర్షీద్లు పాల్గొంటారు. ఈ సమావేశానికి శశిథరూర్ నాయకత్వం వహిస్తున్నారు.
సమావేశంలో దేశ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపకల్పన
మధ్యతరగతి ప్రజలతో మమేకమయ్యే బాధ్యతను సల్మాన్ కు అప్పచెబుతూ ఆయన్ను జాతీయ కన్వీనర్గా నియమించడం జరిగింది. ప్రత్యామ్నాయ అజెండా తయారు చేయడంతో పాటు దేశ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ను ఈ సమావేశంలో తయారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు భవిష్యత్తులో ఐటీ నిపుణులతో బెంగళూరులో, డాక్టర్లతో చెన్నైలో సమావేశం నిర్వహించనుంది ఏఐపీసీ. ఇలాంటి కార్యక్రమాలు లక్నో, జంషెద్పూర్లో కూడా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు ఏఐపీసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి కాంగ్రెస్ భావజాలాలు నచ్చకపోవచ్చు కానీ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై వారు వ్యతిరేకతతో ఉన్నారని ఏఐపీసీ వెల్లడించింది.