‘రాహుల్ ఓ అసమర్థ నేత! కాంగ్రెస్ పతనం ఖాయం’
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన గోవా నేత విశ్వజిత్ రాణె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన గోవా నేత విశ్వజిత్ రాణె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఓ అసమర్థ నేత అని, ఆయన నేతృత్వంలో ఆ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరింత దిగజారడం ఖాయమన్నారు.
గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ అసమర్థతతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. గోవాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్సింగ్ రాణె కుమారుడైన విశ్వజిత్ రాణె తన అసంతృప్తి వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
2019 ఎన్నికల నాటికి రాహుల్ గాంధీ సారథ్యమే కొనసాగితే కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని, లోక్సభలో ఆ పార్టీ 20 సీట్లకు పడిపోవడం ఖాయమన్నారు. రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్కు ఓ దిశ అంటూ ఏమీ లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోడీని సవాల్ చేసే నాయకులెవరైనా కాంగ్రెస్లో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు రాణె స్పందిస్తూ.. మరో పదేళ్ల వరకు ఆ పార్టీ భవితవ్యమే తనకు కనబడటంలేదన్నారు.
రాహుల్గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్నేత దిగ్విజయ్సింగ్పైనా తీవ్ర విమర్శలు చేశారు రాణె. గోవాలో ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్న దిగ్విజయ్ అనుసరించిన తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏర్పడిన గందరగోళానికి ఆయన తీరే కారణమన్నారు. ఆయన సృష్టించిన గందరగోళం వల్లే గోవాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందన్నారు.