కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్.. బీజేపీ కల చెదిరిందా? అందరి దృష్టి జేడీఎస్పైనే!
కర్ణాటక రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్నది. తాజా ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ ఇవ్వకుండా ఓటరు తీర్పు చెప్పడంతో రాష్ట్ర అసెంబ్లీలో హంగ్ ఏర్పడింది. దాంతో అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఆఫర్కు జేడీఎస్ నేత కుమారస్వామి అంగీకారం తెలిపినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఏకమైన కాంగ్రెస్, జేడీఎస్
బీజేపీకి అధికారం దక్కకుండా కాంగ్రెస్, జేడీఎస్ ఏకమయ్యాయి. దేవగౌడతో కాంగ్రెస్ తరఫున గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి.
ఇక జేడీఎస్ను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ
ప్రయత్నించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొంటామనే ధీమాతో బీజేపీ కొంచెం ఆలస్యంగా సంప్రదించింది. ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డాలను బెంగళూరుకు పంపి పవర్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ను బుట్టలో వేసుకొన్నది.
సక్సెస్ బాటలో కాంగ్రెస్ పార్టీ
గత ఎన్నికల్లో బీజేపీ చేతిలో చేదు అనుభవాన్ని చూసిన కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో తమ ప్రయత్నాలను సానుకూలంగా మలుచుకొన్నారు. జేడీఎస్ను బీజేపీ వైపు వెళ్లకుండా ఆపగలగడంతో కాంగ్రెస్ సక్సెస్ అయింది.
దేవగౌడతో జాతీయ నేతలు
కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవగౌడకు మమతా బెనర్జీ, మయావతి నచ్చచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో జేడీఎస్ శిబిరంలో సంతోషకరమైన వాతావరణం నెలకొన్నది. కుమారస్వామి ముఖ్యమంత్రి కావడం తథ్యం అనే మాటను జేడీఎస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇండిపెండెంట్ల మద్దతు
కాంగ్రెస్, జేడీఎస్ కూటమితో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా జతకలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు సిద్ధమని వారు వెల్లడించినట్టు సమాచారం. అయితే ఈ కూటమి బంధం ఏ మేరకు ముందుకు సాగుతుందో అనే విషయం ప్రశ్నార్థకంగానే మారింది.
బీజేపీ శిబిరంలో నిరుత్సాహం
బీజేపీ అధిక్యం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో బీజేపీ శిబిరాల్లో ఉత్సాహం, జోష్ భారీగా కనిపించింది. ఢిల్లీలోని జాతీయ కార్యాలయంలో వేడుకలు చేసుకొన్నారు. మీడియాలో అధికార ప్రతినిధులు ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు. కానీ సాయంత్రం వరకు పరిస్థితులు మారడంతో ఒక్కసారిగా చల్లబడ్డారు. దీంతో కర్ణాటక అధికార పగ్గాలను సొంతం చేసుకోవాలన్న కల ఒక్కసారిగా చెదిరింది.