వారికి అణిచివేతే తెలుసు.. ఇది నోట్ల రద్దు లాంటిదే.. సోనియా గాంధీ ఫైర్
పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు పలుకుతున్నదని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ తెలిపారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, ప్రజలపట్ల కేంద్రం అతిక్రూరంగా వ్యవహరిస్తున్నది, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దమననీతికి చోటులేదని ఆమె అన్నారు. సీఏఏ నిరసనోద్యమం నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక వీడియో ద్వారా దేశప్రజలకు సోనియా తన సందేశం పంపారు.
నిరసన ప్రజల హక్కు
బీజేపీ అనుసరిస్తోన్న విభజన రాజకీయాలు, ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా విద్యాలయాల్లో సహజంగానే వ్యతిరేకత ఏర్పడిందని సోనియా అన్నారు. ప్రజాస్వామ్యంలో.. ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సందర్భాల్లో వాటిని నిరసిస్తూ, ఆందోళన వ్యక్తం చేసే అధికారం ప్రజలకు ఉంటుందని, అలాంటి సమయాల్లో పౌరుల అభ్యంతరాల్ని విని, పరిష్కారాలు చూపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని కాంగ్రెస్ చీఫ్ గుర్తుచేశారు.
బీజేపీకి తెలిసిందల్లా దమనీతే
ప్రజల వాయిస్ ని ఏమాత్రం లెక్క చేయని బీజేపీ ప్రభుత్వం.. అసమ్మతిని అణిచేయడానికి పెద్ద ఎత్తున బలగాలను ప్రయోగిస్తున్నదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు చెల్లబోవని సోనియా గాంధీ చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కేంద్ర సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతున్నదని తెలిపారు. న్యాయం కోసం నినదిస్తూ, ఉద్యమిస్తున్న విద్యార్థులు, ప్రజలకు పార్టీ అన్ని విధాలుగా బాసటగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
నోట్లరద్దులాగే ఇవి కూడా..
పౌరసత్వ సవరణ చట్టం ముమ్మాటికి సమాజంలో చీలికను, భేదభావాల్ని పెంచుతుందని సోనియా అభిప్రాయపడ్డారు. ‘‘పెద్దనోట్ల రద్దు(డీమానిటైజేషన్) తరహాలోనే.. దేశంలోని ప్రతి పౌరుడూ తన పౌరసత్వాన్ని నిరూపించుకోడానికి క్యూలైన్లనో నిలబడాల్సి దుస్థితి ఏర్పడుతుంది. నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) వల్ల అంతిమంగా సమాజంలోని పేద, బడుగు వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి. ఈ రెండు చట్టాలపై ప్రజలు చేస్తున్న ఆందోళనలో అర్థం ఉంది''అని కాంగ్రెస్ చీఫ్ వివరించారు.
కాంగ్రెస్ అండగా ఉంటుంది
ప్రజల ప్రాధమిక హక్కులు, అధికారాల్నిరక్షించుకోడానికి, రాజ్యాంగం కల్పించిన మౌళిక సూత్రాల్ని కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ముందుంటుందని సోనియా గాంధీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. సోనియా సందేశం నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై కాంగ్రెస్ రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉందని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ శ్రేణులంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలనే ఆదేశాలు వెలువడొచ్చని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.