తొమ్మిది సీట్లల్లో కాంగ్రెస్ పోటీ
Lok Sabha election 2024: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. ఈ నెల 13 లేదా 14వ తేదీన షెడ్యూల్ వెలువడొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు సంసిద్ధమౌతోన్నాయి. పొత్తులు, సీట్ల పంపకాల వ్యవహారాల్లో తలమునకలయ్యాయి.
ఈ క్రమంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే- కాంగ్రెస్ కూటమి మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చాయి. ఈ సాయంత్రం చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.

డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తమిళనాడు పీసీసీ చీఫ్ సెల్వ పెరుంథగై ఇందులో పాల్గొన్నారు. సీట్ల పంపకాలపై చర్చించారు. దీనికి సంబంధించిన ఒప్పందంపై రెండు పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మిగిలిన చోట్ల డీఎంకే, మిత్రపక్షాల అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంది. అలాగే- పుదుచ్చేరిలో ఒక లోక్సభ స్థానంలో కూడా కాంగ్రెస్సే పోటీ చేస్తుంది. ఇక్కడా డీఎంకే.. కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం సాగిస్తుంది.
డీఎంకే-21, కాంగ్రెస్- 10 (పుదుచ్చేరి కలుపుకొని), సీపీఐ- 2, సీపీఎం- 2, వీసీకే- 2, ఎండీఎంకే- 1, ఐయూఎంఎల్- 1, కేఎన్ఎంకే- 1 స్థానాల్లో పోటీ చేస్తాయి. లోక నాయకుడు కమల్ హాసన్కు చెందిన మక్కల్ నీథి మయ్యం కూడా లోక్సభ ఎన్నికల్లో డీఎంకే, మిత్రపక్షాల తరఫున ప్రచారం చేస్తుంది. 2025లో రాజ్యసభకు మక్కల్ నీథి మయ్యం నాయకుడిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications