కరోనా వ్యాక్సిన్పై కేంద్రం ప్లాన్ - వచ్చే జులై నాటికి 50 కోట్ల డోసులు - ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జులై నాటికి దేశంలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఆ దిశగా 40 నుంచి 50 కోట్ల డోసులను ప్రభుత్వమే సేకరిస్తుందని చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 'సండే సంవాద్' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోన్న ఆయన నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
Recommended Video

వచ్చే వేసవికి విస్తృతంగా..
కరోనా వ్యాక్సిన్ పై పలు సంస్థలు చేస్తున్న ప్రయోగాలు కీలక దశకు చేరాయని, ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నప్పటికీ, వ్యాక్సిన్ విస్తృత వినియోగం మాత్రం వచ్చే ఏడాది వేసవి నాటికే సాధ్యమవుతుందన్న నిపుణుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని ఎలా పంపిణీ చేయాలనేదానిపై కేంద్రం పక్కాగా ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. ముందుగా..

ముందుగా ఎవరికంటే..
ఏయే గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్ అందచేయాలనే వివరాలతో ప్రాధాన్యతా గ్రూప్లను పేర్కొంటూ ఈ నెలాఖరులోగా జాబితాలు పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, నర్సులు, పారామెడికల్, పారిశుద్ధ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో పాటు వైరస్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ప్రక్రియలో నిమగ్నమైన అందరికీ తొలి విడతలో వ్యాక్సిన్ అందజేస్తామని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

బ్లాక్ మార్కెట్ ఉండదు..
వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, బ్లాక్ మార్కెట్ కు తావు లేకుండా క్రమపద్ధతిలో ప్రాధాన్యతా క్రమంలో డోసులు అందించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ రూపొందించామని ఆరోగ్య మంత్రి చెప్పారు. ‘‘వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది. భారత వ్యాక్సిన్ తయారీదారులకు పూర్తి సహకారం అందిస్తున్నాం''అని ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలో కరోనా సీన్ ఇది..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో గడిచిన గడిచిన 24 గంటల్లో కొత్తగా 75,829 పాజిటివ్ కేసులు, 940 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65.5లక్షలకు, మరణాల సంఖ్య 1,01, 782కి చేరింది. మిగతా దేశాలకంటే మెరుగైన రికవరీ రేటు ఉండటంతో ఇప్పటికే 55.10లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 9.4లక్షలుగా ఉంది.












Click it and Unblock the Notifications