బ్రతకనివ్వరా.. కారు సైడ్ మిర్రర్కు బైకు తగిలిందని దారుణంగా హత్య..!
ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ.. మానవ సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. క్షణికావేశం కారణంగా మనుషులు చిన్న చిన్న వాటికే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ తరహా ఘటనే ఇప్పుడు బెంగుళూరులో చోటు చేసుకుంది. తమ కారు సైడ్ మిర్రర్కు బైకు తగిలిందని ఓ యువకుడిని.. వెంటాడి కారుతో గుద్ది చంపడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
పుట్టేనహళ్లి ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 22న అర్ధరాత్రి దర్శన్ తన స్నేహితుడు వరుణ్తో కలిసి స్థానిక శ్రీరామ లేఅవుట్లో బైకుపై వెళ్తున్నారు. అయితే అదే సమయంలో పక్కగా వెళుతున్న కారు సైడు మిర్రర్ను వీరి బైకు తగిలింది. దీంతో కారులో ఉన్న మనోజ్కుమార్, ఆయన భార్య ఆరతి శర్మ.. దర్శన్తో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైకును దంపతులు కారులో రెండు కి.మీ మేర వెంబడించి.. వెనక నుంచి బైకును ఢీ కొట్టి వెళ్లిపోయారు.

అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దుర్ఘటనలో చికిత్స పొందుతూ దర్శన్ చనిపోగా.. వరుణ్ చికిత్స పొందుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో కారు విడిభాగాలు కొన్ని పడిపోయినట్టు తెలుస్తోంది. దాంతో మనోజ్, ఆరతి ముఖాలకు మాస్కులు వేసుకుని వెనక్కి వచ్చి వాటిని తీసుకెళ్లారు. ఈ విషయం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలలో పోలీసులు గుర్తించారు. ఇక నిందితులను అరెస్ట్ చేసినట్టు జేపీనగర పోలీసులు వెల్లడించారు. వారిపై హత్య, సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
ఈ ఘటనపై స్థానికులు, సోషల్ మీడియా వేదికలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న కారణం కోసం ఒక యువకుడి ప్రాణం తీయడం పాశవికమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications