జయ సమాధి వద్ద వీరాభిమాని పెళ్లి: అమ్మ అంటే ! (వీడియో)
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీరాభిమాని బంధుమిత్రుల సమక్షంలో మెరినా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి ప్రాంగణంలోని జయ సమాధి వద్ద పెళ్లి చేసుకుని అమ్మ భక్తిని చాటు కున్నాడు.
చెన్నైలోని కోళత్తూరు ప్రాంతానికి చెందిన ఫ్రాన్సిస్ అన్నాడీఎంకే యువజన విభాగం నాయకుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి రెజీలా ప్రీతి అనే యువతితో పెళ్లి నిశ్చయం అయ్యింది. 2017 ఫిబ్రవరి 1వ తేది పెళ్లి జరగవలసి ఉంది.
తన పెళ్లికి హాజరు కావాలని రెండు నెలల క్రితం ఫ్రాన్సిస్ జయలలితకు శుభలేఖ ఇచ్చారంట. పెళ్లికి తప్పకుండా వస్తానని జయలలిత హామీ ఇచ్చారని ఫ్రాన్సిస్ అంటున్నాడు. అయితే ఇటీవల అమ్మ మరణించడంతో ఫ్రాన్సిస్ షాక్ కు గురైనాడు.
వెంటనే రెజీలా ప్రీతి కుటుంబ సభ్యులను కలిసిన ఫ్రాన్సిస్ తాను అమ్మ సమాధి దగ్గర పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అందుకు ఇరుకుటుంబ సభ్యులు అంగీకరించారు. బుధవారం మెరీనా బీచ్ చేరుకుని అమ్మ సమాధి దగ్గర ఫ్రాన్సిస్, రేజీలా ప్రీతీ పూల దండలు మార్చుకున్నారు.
తరువాత ఫ్రాన్సిస్ రెజీలా ప్రీతి మెడలో మంగళసూత్రం కట్టారు. ఈ సందర్బంగా ఇరు కుటుంబ సభ్యులు జయ సమాధి మీద ఉన్న పూలనే వధూవరుల మీద చల్లి ఆశీర్వధించారు. ఈ సందర్బంలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ మా నాయకురాలు జయలలిత ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని గుర్తు చేశారు.
అయితే ఆమె అకాలమరణంతో తన ఆశ నెరవేరలేదని అనుకుంటున్న సమయంలో ఇరు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అమ్మ సమాధి సాక్షిగా వివాహం చేసుకున్నామని చెప్పారు. మొత్తం మీద జయ సమాధి దగ్గర మొట్టమొదటి సారి పెళ్లి చేసుకున్న జంటగా ఫ్రాన్సిస్, రేజీలా ప్రీతి రికార్డు సృష్టించారు.