జమ్మూ కాశ్మీర్ లో గొడవలు, కర్ఫ్యూ
జమ్మూ: జమ్మూ- కాశ్మీర్ లో శాంతిభద్రతలకు భంగం కలిగింది. మత ఘర్షణలు అదుపు చెయ్యడానికి వెళ్లిన పోలీసులకు తీవ్రగాయాలు కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రతగా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ- కాశ్మీర్ లోని సాంబా జిల్లాలోని రాయమోర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం మత ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాల మద్య చిచ్చు రగిలింది. అదే సమయంలో జిల్లా మేజిస్ట్రేట్ వాహనంపై ఆందోళనకారులు దాడులు చేశారు.
మేజిస్ట్రేట్ వాహనం పూర్తిగా దెబ్బతినిందని పోలీసు అధికారులు తెలిపారు. పలు ప్రభుత్వ వాహనాలపైన దాడులు చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసు అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
గురువారం సాయంత్రం బారి బ్రాహ్మణ ప్రాంతంలో మత గ్రంధాలయం మీద పలు ఆరోపణలు రావడంతో రెండు వర్గాల మద్య గొడవలు మొదలైనాయి. ఇరు వర్గాలు నిరసన వ్యక్తం చేస్తు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం చేరుకున్నారు.
అక్కడ ఇంకా గొడవ ఎక్కువ కావడంతో ఇరు వర్గాల వారు ప్రభుత్వ వాహనాలు ద్వంసం చేసి పోలీసుల మీద దాడులు చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.