హోలీ వేడుకలు: దళిత బాలుడిని దారుణంగా చంపేశారు, రెండు వర్గాల గొడవతో బలి!
జైపూర్: హోలీ పండగ సందర్బంగా రాజస్థాన్ లో ఓ దళిత బాలుడు దారుణ హత్యకు గురైనాడు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవకు అమాయకుడైన బాలుడు హత్యకు గురైనాడని రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా ఏఎస్పీ పుష్పేంద్ర సింగ్ సోలంకి అన్నారు.
స్నేహితులతో హోలీ
అల్వార్ జిల్లా భీవాడి గ్రామంలో నీరజ్ జాటవ్ (16) అనే దళిత బాలుడు నివాసం ఉంటున్నాడు. శుక్రవారం నీరజ్ ఇంటిలో ఉన్నాడు. మద్యాహ్నం 3 గంటల సమయంలో నీరజ్ స్నేహితులతో కలిసి హోలీ వేడుకలకు వెలుుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
రెండు వర్గాలు
నీరజ్ ఇంటి సమీపంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకులు హోలీ వేడకల్లో రంగులు చల్లుకుంటున్నారు. వారితో కలిసి హోలీ వేడుకలు జరుపుకోవాలని నీరజ్ అక్కడికి వెళ్లాడు. రంగులు చల్లుకునే విషయంలో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలైనాయి.
కత్తులతో దాడి
రెండు వర్గాల మద్య గొడవ సమయంలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన ఓ వర్గంలోని యువకులు కత్తులు తీసుకుని మరో వర్గం మీద దాడులకు దిగారు. ఆ సమయంలో నీరజ్ ను పట్టుకున్న కొందరు యువకులు కత్తులతో ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు.
రంగులు కాదు రక్తం
విషయం గుర్తించిన నీరజ్ కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పదునైన కత్తిపోట్లు పడటం, రక్తం ఎక్కువగా పోవడంతో నీరజ్ మరణించాడని వైద్యులు చెప్పారని ఏఎస్పీ పుష్పేంద్ర సింగ్ సోలంకి చెప్పారు.
అమాయకుడు బలి
చిన్న విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడం వలనే అమాయకుడైన నీరజ్ బలి అయ్యాడని ఏఎస్పీ పుష్పేంద్ర సింగ్ సోలంకి అన్నారు. నీరజ్ హత్య కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఏఎస్పీ పుష్పేంద్ర సింగ్ సోలంకి తెలిపారు.