జొమాటో, డోమినోస్ సర్వీసులు రద్దు.. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో తొమ్మిదికి పెరిగిన మరణాలు
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఒక్కరోజే ఆరుగురు చనిపోయారు. దీంతో ఆందోళనల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. గురువారంనాటి నిరసనల్లో.. కర్నాటకలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్ లో ఒకరు బలయ్యారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ యాప్ లు ఢిల్లీలోని కొన్ని ఏరియాల వరకు తమ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
యూపీలో ఆరుగురు..
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో భాగంగా గురువారం కర్నాటకలో ఇద్దరు, యూపీలో ఒకరు చనిపోగా, శుక్రవారం మాత్రం ఒక్క యూపీలోనే ఆరు చనిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయని, పలు చోట్ల హింస చెలరేగిందని, ఈ క్రమంలో బిజ్నూర్ లో ఇద్దరు, మీరట్, సంభాల్, కాన్పూర్, ఫిరోదాబాద్ పట్ణణాల్లొ ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు వ్యక్తులు చనిపోయారని డీజీపీ వివరించారు.
మరణాల్లో మా ప్రమేయం లేదు
కాగా, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో చోటుచేసుకున్న మరణాలకు పోలీసులు ఏవిధంగానూ బాధ్యులు కాబోరని యూపీ డీజీపీ సింగ్ చెప్పారు. నిరసనల పట్ల పోలీసులు సంయమనంతో వ్యవహరించారని, చాలా చోట్ల పోలీసులపైనా దాడులు జరిగాయని, కనీసం ఒక్క బుల్లెట్ కూడా పోలీసులు కాల్చలేదని అయన తెలిపారు. కాన్పూర్ లో జరిగిన ఘటనల్లో 13 మంది గాయపడ్డారని, హింసకు పాల్పడుతున్న 25 మంది నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నామని సింగ్ చెప్పారు.
జొమాటో, డోమినోస్ సర్వీసులు బంద్
సీఏఏ వ్యతిరేక నిరసనల వేడితో ఫుడ్ యాప్ లు తమ సర్వీసుల్ని రద్దు చేసుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో నిరసణలు తీవ్రంగా జరుగుతున్న ప్రాంతాల్లో సర్వీసులు రద్దు చేస్తున్నట్లు జొమాటో, డోమినోస్ సంస్థలు శుక్రవారం రాత్రి ప్రకటనలు చేశాయి. పరిస్థితిని బట్టి త్వరలోనే సర్వీసుల్ని పునరుద్ధరిస్తామని తెలిపాయి.