UAPA: ఏళ్ల తరబడి జైల్లో ఉండక్కర్లేదు..! CJI సంచలన వ్యాఖ్యలు
దేశంలో కఠిన చట్టాల కింద నమోదైన కేసుల్లో ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్న విచారణ ఖైదీల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA), మనీలాండరింగ్ (PMLA), డ్రగ్స్ నిరోధక చట్టం (NDPS) వంటి కఠినమైన చట్టాల కింద నమోదయ్యే కేసుల విచారణను వేగవంతం చేయడం ఒక్కటే దీనికి ఏకైక మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
బెయిల్ రాక, విచారణ పూర్తికాక ఏళ్ల తరబడి నిందితులు జైళ్లలోనే ఉండటంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. సుమారు 15 నెలల తన పదవీకాలంలో సగానికి చేరుకున్న సందర్భంగా ఒక ప్రముఖ జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీజేఐ పలు కీలక విషయాలను పంచుకున్నారు.

ఏడాదిలోనే విచారణ పూర్తి.. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు!
ఢిల్లీ అల్లర్ల కేసులు, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ వంటి వారు ఎదుర్కొంటున్న UAPA కేసుల విచారణలో జరుగుతున్న ఆలస్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీజేఐ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిర్దిష్ట కేసులపై నేరుగా స్పందించనప్పటికీ.. ఈ సమస్యను అధిగమించడానికి న్యాయవ్యవస్థ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు. UAPA, PMLA, NDPS కేసుల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు చెప్పారు.
ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కూడా మొదలైందని తెలిపారు. ఈ ప్రత్యేక కోర్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, ఏడాది కాల పరిమితిలోగా విచారణలు పూర్తి చేయడం ప్రారంభిస్తే.. విచారణ ఖైదీల సుదీర్ఘ బంధీలపై సాగుతున్న వివాదానికి తెరపడుతుందని సీజేఐ ఆశాభావం వ్యక్తం చేశారు.
5 కోట్లు దాటిన కేసులు.. సామాన్యుడికి సుప్రీంకోర్టు దూరం కాకూడదు!
ప్రస్తుతం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.. గుట్టలుగా పేరుకుపోతున్న కేసుల పెండింగేనని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య ఏకంగా 5.05 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. ఇందులో దాదాపు 1.1 కోట్ల సివిల్ కేసులు ఉండగా, 3.9 కోట్ల వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
అదే సమయంలో సుప్రీంకోర్టు సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. నేటికీ చాలామంది సామాన్యులు సుప్రీంకోర్టు అనగానే భయపడుతున్నారని, తమ కేసుల విచారణకు ఏళ్లు పడుతుందేమోనని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మంచి లాయర్లను పెట్టుకోలేమేమోనని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ అపోహను తగ్గించడానికి ఉచిత న్యాయ సహాయం నాణ్యతను పెంచామని, సీనియర్ లాయర్లను దీని కోసం ఎంపానెల్ చేశామని ఆయన వెల్లడించారు.
ట్రిబ్యునళ్లపై రిటైర్డ్ జడ్జీలు దృష్టి పెట్టాలి..
జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT), ఎన్సీఎల్టీ (NCLT), ఐటీఏటీ (ITAT) వంటి ట్రిబ్యునళ్ల పనితీరు, వాటిపై ప్రజల్లో ఉన్న గుర్తింపుపై కూడా సీజేఐ స్పందించారు. కోర్టులపై భారం తగ్గించడానికి, ప్రత్యేక రంగాల వివాదాలను వేగంగా పరిష్కరించడానికి ఈ ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయని, వీటి విశ్వసనీయతను కాపాడటం చాలా ముఖ్యమని చెప్పారు.
అయితే, ఇటీవల సర్వీస్ నిబంధనల్లో వచ్చిన మార్పుల వల్ల రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు ఈ ట్రిబ్యునళ్లకు నేతృత్వం వహించడానికి ఆసక్తి చూపించడం లేదని ఆయన సున్నితంగా ప్రస్తావించారు. దేశ సేవగా భావించి ప్రతిభావంతులైన రిటైర్డ్ జడ్జీలు ఈ ట్రిబ్యునళ్ల బాధ్యతలను స్వీకరించాలని తాను కోరుతున్నట్లు సీజేఐ తెలిపారు. ట్రిబ్యునళ్ల నమ్మకత్వం, న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications