ఎగ్జిట్ పోల్స్: కిరణ్ బేడీపై కేజ్రీవాల్ పైచేయి, పెద్ద పార్టీగా అప్
న్యూఢిల్లీ: జాతీయ చానెళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేలు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 శాసనసభా స్థానాలున్నాయి. శనివారంనాడు శాసనసభ ఎన్నికలకు 70 శాతం పోలింగ్ నమోదైంది. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీపై అరవింద్ కేజ్రీవాల్ పైచేయి సాధించిన సూచనలు కనిపిస్తున్నాయి.
సీ - ఓటర్ సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఆప్కు 31 నుంచి 39 సీట్లు, బిజెపికి 27 నుంచి 35 స్థానాలు, కాంగ్రెసు పార్టీకి 2 నుంచి 4 స్థానాలు రావచ్చునని అంచనా వేసింది. దీని ప్రకారం త్రిశంకు అసెంబ్లీ కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీని ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుంది.
ఇండియా టుడే - సిసిరో ఎగ్జిట్ పోల్ సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకి 35 నుంచి 43 స్థానాలు, బిజెపికి 23 నుంచి 29 సీట్లు, కాంగ్రెసుకు 3 నుంచి 5 సీట్లు రావచ్చునని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం త్రిశంకు అసెంబ్లీకి అవకాశం లేదు.
హెడ్ లైన్స్ టుడే సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 35 నుంచి 43 సీట్లు, బిజెపికి 23 నుంచి 36 సీట్లు, కాంగ్రెసుకు 3 నుంచి ఐదు సీట్లు వస్తాయి.
టైమ్స్ నౌ సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 31 నుంచి 36 సీట్లు, బిజెపికి 27-35 స్థానాలు, కాంగ్రెసుకు 2 నుంచి 4 సీట్లు వస్తాయి.
ఎబిపి నీల్సన్ సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 39 సీట్లు, బిజెపికి 28 స్థానాలు, కాంగ్రెసుకు 3 స్థానాలు వస్తాయి. ఎన్డీటీవి కూడా ఆమ్ ఆద్మీ పార్టీవైపే మొగ్గు చూపుతోంది.