ఢిల్లీ డిప్యూటీ సీఎంకు చుక్కలు చూపించిన పోలీసులు
న్యూఢిల్లీ: నిజాయితీ కలిగిన పోలీసులు తలుచుకుంటే తప్పు చేసింది ఎంత పెద్ద నాయకుడు అయినా సరే వెనుకా ముందు ఆలోచించకుండా వారి మీద చర్యలు తీసుకుంటారు. అయితే స్వయానా ఢిల్లీలో పని చేస్తున్న పోలీసులు అదే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కారు డ్రైవర్ నుండి అపరాధ రుసుం వసూలు చేశారు.
ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా ఈ నెల 12వ తేది సాయంత్రం కారులో బయలుదేరారు. కారు ఢిల్లీలోని హజూరి ఖాస్ చౌక్ సమీపంలో వేగంగా వెళ్లింది. కారు అతి వేగంగా వెళుతున్నదని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వెంటనే వారు ముందు సిగ్నల్ లో పోలీసులకు సమాచారం అందించారు.
కారు అతి వేగంగా వస్తున్నదని, కారును నిలపాలని సూచించారు. తర్వాత వచ్చిన జంక్షన్ లో ట్రాఫిక్ పోలీసులు మనీష్ సిసోడియా కారును అడ్డగించారు. తరువాత కారు అతి వేగంగా నడిపినందుకు రూ. 400 అపరాధ రుసుం విధించి చీటి వ్రాసి డ్రైవర్ చేతిలో పెట్టారు.
ఈ విషయంపై ఢిల్లీ ట్రాఫిక్ విభాగం సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తు ట్రాఫిక్ పోలీసులు వారి పని వారు చేసుకుని వెళుతుంటారని పోలీసుల తీరును సమర్థించుకున్నారు. కొంత కాలం క్రితం లక్నో విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నిషేధిత ప్రాంతం నుండి వెళుతున్న సమయంలో మహిళ కానిస్టేబుల్ అడ్డుకున్న విషయం తెలిసిందే.