ధోతీతో వస్తే నో ఎంట్రీ: అట్టుడికిన తమిళ అసెంబ్లీ
చెన్నై: ధోతి ధరించిన కారణంగా ఓ న్యాయమూర్తిని చెన్నైలో చెపాక్ స్టేడియంలోని తమిళనాడు క్రికెట్ సంఘం క్లబ్లోకి రానీయకపోవడంపై తమిళనాడు శాసనసభలో దుమారం చెలరేగింది. వారం క్రితం ఆ సంఘటన జరగగా సోమవారం శాసనసభలో తీవ్ర రభస జరిగింది. తమిళులకు అన్యాయం చేసినందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని క్లబ్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
పలు క్లబ్లు ఈ విధానాన్ని పాటిస్తున్నాయని,, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమిళ సంస్కృతి గౌరవాన్ని కాపాడాలని డిఎంకె నేత, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు. ధోతులు ధరించినవారు 67 ఏళ్ల క్రితం వలసపాలకులను తరిమికొట్టడంలో ప్రధానమైన పాత్ర పోషించారని అంటూ టిఎన్సిఎ క్లబ్ మాత్రమే కాదు, మద్రాసు జింఖానా క్లబ్, ఎంసిసి, బోట్ క్లబ్ వంటి చాలా అదే పద్ధతిని అనుసరిస్తున్నాయని ఆయన చెప్పారు.

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి హరిపరాంథమన్ సీనియర్ న్యాయవాదులు ఆర్ గాంధీ, జిఆర్ స్వామినాథన్లతో కలిసి ఓ పుస్తక ఆవిష్కరణ కోసం క్రికెట్ క్లబ్కు వెళ్లారు. ఆ పుస్తకాన్ని మద్రాసు హైకోర్టు మాజీ యాక్టింగ్ చీఫ్ జిస్టిస్ టిఎస్ అరుణాచలం రాశారు. వాళ్లు ధోవతులు ధరించడదంతో వారిని లోనికి అనుమతించలేదు.
ఈ సంఘటన అత్యంత సిగ్గుమాలిన చర్య అని సిపిఎం శాసనసభా పక్ష నేత ఎ సౌందరరాజన్ అన్నారు. క్లబ్ నిబంధనలను సడలించకపోతే చట్టం తేవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమిళ సంప్రదాయాలను అవహేళన చేశారని సిపిఐ నాయకుడు ఆర్ముగం అన్నారు. ఇతర పార్టీల నాయకులు కూడా క్లబ్ చర్యను వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications