పెళ్లికొడుకుల మార్కెట్: అక్కడికెళ్లి నచ్చిన వరున్నిసెలెక్ట్ చేసుకోవచ్చు..
సంవత్సరంలో 9రోజుల పాటు సాగే ఈ మేళాను సభాగతి అంటారు. దేశీ కుటుంబాలే కాదు విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ కుటుంబాలు సైతం ఇక్కడికొచ్చి వరున్ని వెతుక్కుంటాయి.
బీహార్: ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తక్కువవుతుండటంతో.. పెళ్లికాని ప్రసాద్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే ఉంది. అందం, ఉద్యోగం.. ఇలా అన్నీ ఉన్నా.. పెళ్లి చేసుకోవడానికి పిల్ల మాత్రం దొరకడం లేదు. దీంతో వయసు 40కి దగ్గరపడుతున్నా..ఒంటరిగానే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి.
బహుశా ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించారో.. ఏమో గానీ.. బీహార్ లో ఎప్పటినుంచో 'పెళ్లికొడుకుల మార్కెట్' మార్కెట్ ఒకటి నడుస్తోంది. వరుడు కావాలనుకున్నవాళ్లంతా.. అక్కడికెళ్లి నచ్చిన వ్యక్తిని సెలక్ట్ చేసుకోవచ్చు. నచ్చితే వెంటపెట్టుకుని కూడా వెళ్లవచ్చు. బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలో సుమారు 700సంవత్సరాలుగా ఈ పెళ్లి కొడుకుల మార్కెట్ కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.
సంవత్సరంలో 9రోజుల పాటు సాగే ఈ మేళాను సభాగతి అంటారు. దేశీ కుటుంబాలే కాదు విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ కుటుంబాలు సైతం ఇక్కడికొచ్చి వరున్ని వెతుక్కుంటాయి. అబ్బాయి నచ్చితే పెళ్లి కుదర్చేందుకు అక్కడే కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉంటారు. వారి సమక్షంలో వివాహ చర్చలు పూర్తయిన తర్వాత.. అంతా ఓకె అనుకుంటే వరున్ని వెంట తీసుకెళ్లవచ్చు.
వరుడి యోగ్యతలకు తగ్గట్లుగా వధువు కుటుంబ సభ్యులు కట్నకానుకలు సమర్పిస్తారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పెళ్లి కొడుకుల మార్కెట్.. రాను రాను గత ప్రాభవాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు లక్షల్లో జనం వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయిందని స్థానికులు చెబుతున్నారు.