ఆర్కేనగర్లో హైటెన్షన్: డీఎంకె నేతలకు కత్తిపోట్లు.. అనుమానం వారి పైనే!
దాడికి పాల్పడింది అన్నాడీఎంకె చిన్నమ్మ వర్గానికి చెందినవారేనని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
చెన్నై: ఆర్కేనగర్ బై పోల్ కాక రేపుతోంది. ఎన్నికలకు మరో ఆరు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. గెలుపు కోసం అభ్యర్థులంతా సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఇదే క్రమంలో పలు అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకుంటుండం ఉపఎన్నికలను ఉద్రిక్తంగా మారుస్తోంది.
తాజాగా బుధవారం నాడు ఆర్కే నగర్ నియోజకవర్గంలో ముగ్గురు డీఎంకె సభ్యులు తీవ్ర కత్తిపోట్లకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డీఎంకె సభ్యులు కత్తిపోట్లకు గురయ్యారని తెలియగానే ఆ పార్టీ కార్యకర్తలంతా వాషర్ మెన్ పేట పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. దాడి చేసినవారిని అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
ఓటర్లకు డబ్బు పంపిణీ:
కాగా, ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న సమమంలోనే తాము కత్తిపోట్లకు గురయ్యామని డీఎంకె నేతలు పార్థసారథి, మహ్మద్ సైఫ్, అబ్బాస్లు పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం రాయపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతుండగా.. దాడికి పాల్పడింది అన్నాడీఎంకె చిన్నమ్మ వర్గానికి చెందినవారేనని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
డబ్బు ప్రలోభాలు
గాలింపు నేపథ్యంలో ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెడుతున్న మరో 17మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. వీరంతా నేతాజీనగర్ లో పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నట్లుగా డిప్యూటీ కమిషన్ జయకుమార్ తెలిపారు.
రిగ్గింగ్కు పాల్పడకుండా చర్యలు:
ఎన్నికల సందర్బంగా రిగ్గింగ్ కు, పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యానికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నిలక అధికారి డి.కార్తికేయన్ తెలిపారు. ఎన్నికల వేళ డబ్బు ప్రలోభాలు ఎక్కువయ్యాయని, ఇప్పటికీ దీనిపై 65ఫిర్యాదులు అందాయని, ఇవిగాక మరో 435ఫిర్యాదులు అందాయని జయకుమార్ చెప్పారు.
రెండాకుల గుర్తుపై నిషేధం ఉన్నా..
ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకె చిహ్నం రెండాకుల గుర్తును తాత్కాళికంగా నిషేధించినా.. ఆ పార్టీ మాత్రం ఎన్నికల్లో యథేచ్చగా ఆ గుర్తును వాడుకుంటుందంటూ ఆ పార్టీ ఆర్కేనగర్ అభ్యర్థి టీటీవి దినకరన్ పై పన్నీర్ సెల్వం వర్గం అభ్యర్థి మదుసూదన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఇదే విషయంపై ఇటీవల ఈసీ దినకరన్ కు నోటీసులు జారీ చేసింది. నిషేధం విధించినా.. రెండాకుల గుర్తుతో ప్రచారం నిర్వహించడం పట్ల వివరణ ఇవ్వాలని కోరింది. ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం సైతం మరోసారి దీనిపై ఫిర్యాదు చేయడంతో ఈసీ ఎలా స్పందిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.