తమిళనాడులోనూ ఓటుకు నోటు.. కానీ దీని కథ వేరు..
అసలే ఎన్నికల సమయం.. మధ్యం డబ్బు ఏరులైపారుతుంటుందీ. ఇంకేముంది తమిళనాడులోనూ ఓటుకు నోటు కేసు తరహాలో ఎవరో బుక్కయ్యే ఉంటారనుకుంటున్నారా..! అసలు విషయం అది కాదు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అవినీతికి తావు ఇవ్వకుండా ఉండడానికి ఈసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. అక్కడి ప్రజలతో ఓటుకు నోటు తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయిస్తోంది.
'ఓటుకు నోటు తీసుకోం' పేరిట రాష్ట్ర ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది ఎన్నికల సంఘం. ఇందుకోసం రాష్ట్రంలోని మొత్తం 1,07,517 కేంద్రాల్లో ప్రచారం నిర్వహించింది. ఎన్నికల సంఘం ఆద్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిజ్ఞల్లో 1.64 కోట్ల మంది పాల్గొన్నారు. ప్రతిజ్ఞలో భాగంగా.. డబ్బు కోసం తమ ఓటును అమ్ముకోబోమని ప్రమాణం చేశారు ఓటర్లు. దీన్ని ఎన్నికల సంఘం సాధించిన విజయంగా పేర్కొన్నారు ఎన్నికల సంఘం ముఖ్యాధికారి రాజేష్ లఖోని.
తమిళనాడులో మే 16వ తేదీన జరగబోయే ఎన్నికల కోసం.. 100 శాతం ఓటింగ్ నమోదు కావాలనే లక్ష్యంతో సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలియజేశారు.