Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏప్రిల్ 30: వీరి భవితవ్యంపై ఓటర్ల తీర్పు(పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 139 మిలియన్ల ఓటర్లు.. 1200 మంది అభ్యర్థుల భవితవ్యంపై బుధవారం (ఏప్రిల్ 30)న జరిగే లోకసభ ఎన్నికల పోలింగ్‌లో నిర్ణయించనున్నారు. ఎందరో ప్రముఖులు బరిలో ఉండగా.. 89 లోకసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్(తెలంగాణ)లోని 17 లోకసభ స్థానాలకు, బీహార్‌లోని ఏడు స్థానాలకు, గుజరాత్ రాష్ట్రంలోని 26 స్థానాలకు, జమ్మూకాశ్మీర్‌లోని 1 స్థానానికి, పంజాబ్‌లోని 13, ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లోని 9 స్థానాలకు, కేంద్ర ప్రాంతాలు దాద్రానగర్ హవేలిలో 1 స్థానం, డామన్ డయ్యూలో 1 స్థానానికి బుధవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఇదే సమయం(బుధవారం, ఏప్రిల్ 30)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో 119 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీహార్‌లో 1, గుజరాత్‌లో 7, ఉత్తరప్రదేశ్ 2, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1 స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది.

బుధవారం జరిగే ఈ ఎన్నికల పోలింగ్‌లో ప్రముఖ రాజకీయ నాయకుల భవితవ్యంపై ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ, బాలీవుడ్ గాయకుడు బప్పి లహిరిలు ఈ రాజకీయ ప్రముఖుల జాబితాలో ముందున్నారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలి నియోజక వర్గం నుంచి మూడోసారి లోకసభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఆమె ప్రత్యర్థులుగా బిజెపి నుంచి అజయ్ అగర్వాల్, బహుజన్ సమాజ్‌వాది పార్టీ నుంచి ప్రవేష్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అర్చన శ్రీవాత్సవ ఉన్నారు. 2009లో జరిగిన లోకసభ ఎన్నికల్లో సోనియా గాంధీ 6,66,699 ఓట్లతో గెలుపొందారు.

రాజ్‌నాథ్ సింగ్

రాజ్‌నాథ్ సింగ్

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఇదే స్థానం నుంచి గతంలో గెలుపొందారు. ఈ స్థానం బిజెపికి కంచుకోటగా ఉంది. 2009 ఎన్నికల్లో లాల్ జీ టాండన్ 5,87,772 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రత్యర్థులగా కాంగ్రెస్ పార్టీ నుంచి రీటా బహుగుణ జోషి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జావేద్ జాఫ్రీ ఉన్నారు.

మురళీ మనోహర్ జోషి

మురళీ మనోహర్ జోషి

బిజెపి అగ్రనేత మురళీ మనోహర్ జోషి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లోకసభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి 2009 ఎన్నికల్లో శ్రీప్రకాశ్ జైస్వాల్ 5,12,917 ఓట్లతో గెలుపొందారు. నరేంద్ర మోడీ కోసం వారణాసి ఎంపిగా ఉన్న జోషి ఆ స్థానాన్ని త్యాగం చేశారు. జోషి ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి శ్రీప్రకాశ్ జైస్వాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మహమూద్ హుస్సేన్, బిఎస్‌పి నుంచి సలీం అహ్మద్, సమాజ్‌వాది పార్టీ నుంచి సురేంద్ర మోహన్ అగర్వాల్ ఉన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వడొదర లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మధుసూదన్ మిస్త్రీ బరిలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఈ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. కాగా, నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోకసభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి మే 12న ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2009 ఎన్నికల్లో వడొదర నుంచి బిజెపి అభ్యర్థి బాలకృష్ణ ఖండేరావు అలియాస్ బాలుశుక్లా 7,47,196 ఓట్లతో గెలుపొందారు.

ఎల్‌కె అద్వానీ

ఎల్‌కె అద్వానీ

బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ గుజరాత్‌లోని గాంధీ‌నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మొదట తాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ గాంధీనగర్ నుంచే పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు.

పరేశ్ రావల్

పరేశ్ రావల్

అహ్మదాబాద్ తూర్పు నుంచి ఏడు సార్లు ఎంపిగా ఎన్నికైన హరీన్ పాఠక్‌ను కాదని, బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌కు ఈ స్థానాన్ని బిజెపి కేటాయించింది. దీంతో నొచ్చుకున్న హరీన్ పాఠక్ తన పక్క నియోజకవర్గమైన గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న ఎల్‌కె అద్వానీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పరేశ్ రావల్ తరపున ప్రచారం చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు.

జైపాల్ రెడ్డి

జైపాల్ రెడ్డి

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌(తెలంగాణ)లోని మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుంచి 10,84,394 ఓట్లతో జైపాల్ రెడ్డి గెలుపొందారు. సుమారు 50ఏళ్ల రాజకీయ ప్రస్థానం కలిగిన జైపాల్ రెడ్డి తొలుత జనతా పార్టీలో కొనసాగారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, బిజెపి-టిడిపి తరపున ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నాగం జనార్ధన్ రెడ్డి నుంచి జైపాల్ రెడ్డికి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇది ఇలా ఉండగా మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు.

కె. చంద్రశేఖర్ రావు

కె. చంద్రశేఖర్ రావు

టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ మెదక్ లోకసభ స్థానం నుంచి, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కెసిఆర్ మేనల్లుడు హరీశ్ రావు మెదక్ జిల్లాలోని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కెసిఆర్ కూతురు కవిత నిజామాబాద్ లోకసభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎంపి మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. కెసిఆర్ కుమారుడు కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, కెసిఆర్ కుటుంబ సభ్యులే ఎక్కువగా పోటీ చేస్తుండటంతో ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేవెళ్ల లోకసభ స్థానం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కెసిఆర్ పోటీలో నిలిపారు. విశ్వేశ్వర్ రెడ్డి ప్రముఖ తెలంగాణ రాజకీయ నేత అయిన రంగారెడ్డి మనువడు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం. చెన్నారెడ్డి మేనల్లుడు కావడం విశేషం. చేవెళ్ల స్థానం నుంచి కాంగ్రెస్ తరపున మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

జయప్రకాశ్ నారాయణ

జయప్రకాశ్ నారాయణ

మల్కాజ్‌గిరి లోకసభ స్థానం నుంచి లోకసత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పోటీ చేస్తున్నారు.

అసదుద్దీన్ ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నారు.

శరద్ యాదవ్

శరద్ యాదవ్

జెడియూ అధ్యక్షుడు శరద్ యాదవ్ బీహార్‌లోని మధేపుర లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులుగా బిజెపి నుంచి విజయ్ సింగ్ కుష్వా, ఆర్జెడి నుంచి రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ఉన్నారు.

కీర్తి అజాద్

కీర్తి అజాద్

మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా అజాద్ కుమారుడే కీర్తి అజాద్. ప్రముఖ క్రికెటరైన కీర్తి అజాద్ బిజెపి తరపున దర్భంగ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం 2009 ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు.

ఫరూఖ్ అబ్దుల్లా

ఫరూఖ్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ లోకసభ స్థానం నుంచి కేంద్రమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ పంజాబ్‌లోని అమృత్‌సర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున అమరీందర్ సింగ్ బరిలో ఉన్నారు.

వినోద్ ఖన్నా

వినోద్ ఖన్నా

పంజాబ్‍‌లోని గుర్దాస్పూర్ లోకసభ స్థానం నుంచి వినోద్ ఖన్నా పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ప్రతాప్ సింగ్.. వినోద్ ఖన్నాపై గెలుపొందారు.

దాద్రానగర్ హవేలి

దాద్రానగర్ హవేలి

దాద్రానగర్ హవేలి లోకసభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున, సిట్టింగ్ ఎంపి నటుంభాయి గోమనభాయి పటేల్, కాంగ్రెస్ తరపున దేల్కర్ మోహన్ భాయి సంజిభాయి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖులత్ జనియభాయి చందుభాయి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఛోటుభాయి బాబుభాయి పోటీలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+