ఈవ్ టీజింగ్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
మైసూర్: ఆకతాయి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఉరివేసుకుని తన చనువును చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలోని మైరల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు సంజుపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బాధిత యువతి సుష్మిత(15) గ్రామంలోని ప్రభుత ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ప్రతి రోజూ తన కూతురును నిందితుడు వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో అతను నిందితుడు సంజూ, అతని కుటుంబసభ్యులను హెచ్చరించారు. అయినప్పటికీ సంజు తన వికృత చేష్టలను మార్చుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఘటనా స్థలాన్ని సందర్శించిన బ్లాక్ విద్యాధికారులు, పోలీసులు, దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. బాధిత యువతి చదువులో ఎప్పుడూ ముందు ఉండేదని, ప్రతిభగల విద్యార్థి అని ఆయన చెప్పారు. అయితే వేధింపుల విషయంపై పాఠశాల ఉపాధ్యాయులకు ఆమె ఫిర్యాదు చేయలేదని తెలిపారు.