2014లో ఎలా రిగ్గింగ్ చేశారంటే, గోపినాథ్ముండే మృతికి లింక్: లండన్ సైబర్ ఎక్స్పర్ట్ సంచలనం, ఈసీ ఆగ్రహం
లండన్/న్యూఢిల్లీ: లండన్కు చెందిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా 2014 సార్వత్రిక ఎన్నికల పైన సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం లండన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కూడా ఉన్నారు. సయ్యద్ షుజా ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చునో మీడియాకు తెలిపారు. ఈ సమావేశాన్ని లైవ్ ద్వారా చూపించారు. అయితే, సయ్యద్ షుజా పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపిందని బీజేపీ విమర్శలు చేసింది. 2014కు ముందు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వమే ఉంది. మరోవైపు, 2010 నాటి సాంకేతిక కమిటీ ఆధ్వర్యంలో ఈవీఎంలు తయారు చేసినట్లు తెలిపింది.
గోపినాథ్ ముండే మృతికి ఈవీఎం ట్యాంపరింగ్కు లింక్
బీజేపీ నేత గోపీనాథ్ ముండే మరణానికి ఈవీఎంల ట్యాంపరింగ్కు లింక్ ఉందని కూడా సయ్యద్ షుజా సంచలన ఆరోపణలు చేశారు. ముండే చనిపోలేదని, దారుణంగా హత్య చేశారన్నారు. ఈవీఎంల రిగ్గింగ్ సంబంధించి ఆయనకు అన్ని విషయాలు తెలుసునని చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారన్నారు. దీనికి సంబంధించి కథనం ప్రచురించాలనుకున్న జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ను హత్య చేశారన్నారని ఆరోపించారు. భారత్లో ఈవీఎంల తయారీలో తానూ పాలుపంచుకున్నానని చెప్పారు.
హ్యాకింగ్ పైన మమతా బెనర్జీ ట్వీట్
లండన్లో ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ (యూరప్) ఆధ్వర్యంలో ఈవీఎం హ్యాకథాన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవీఎంను హ్యాక్ చేసి చూపించారు సయ్యద్ షుజా. చాలా ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, తన వద్ద ఆధారాలున్నాయన్నారు. షుజా ఆరోపణలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అంశాన్ని మరోసారి ఈసీ వద్దకు తీసుకెళ్తామన్నారు.
ఓటమిని ముందే అంగీకరించిన కాంగ్రెస్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబాల్తో పాటు ఇతర విపక్ష నేతలు ఉన్నారు. దీంతో బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కపిల్ సిబాల్ను కావాలనే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి పంపించిందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఈ చర్యతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందే ఓటమిని అంగీకరించినట్లు అయిందన్నారు.
ఈసీ కన్నెర్ర, చట్టపరమైన చర్యలకు యోచన
సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. అతనిపై కన్నెర్రజేసింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిపింది. అనుమానాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. రత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో, కట్టుదిట్టమైన భద్రత, నిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాలు అనవసరమని పేర్కొంది. ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తూ తమను లక్ష్యం చేసుకోవడంపై ఈసీ ఆగ్రహించింది. 2010లో నియమితులైన సాంకేతిక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేసినట్లు తెలిపింది.