కేజ్రీవాల్ను కాల్చేస్తానని మాజీ ఆటో డ్రైవర్ బెదిరింపులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ను షూట్ చేస్తానని ఓ వ్యక్తి బెదిరించినట్లుగా పార్టీకి చెందిన సీనియర్ నేత చెప్పారు. కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీరు ఏమాత్రం బాగా లేదని ఆగ్రహంతో ఉన్న నలభై ఏళ్ల వ్యక్తి బెదిరించారట.
ఎఎపి నేత డిడి శర్మ మంగళవారం రాత్రి మాట్లాడుతూ... బుధవారం జంతర్ మంతర్ వద్దకు రానున్న ముఖ్యమంత్రిని షూట్ చేస్తానని ఆ వ్యక్తి కాల్ చేసి బెదిరించారని తెలిపారు.
బెదిరించిన వ్యక్తిని రామ్ నారాయణ్ భక్త్గా గుర్తించారు. అతను ఆర్ట్స్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. ఎఎపితో కలిసి గతంలో పని చేసినట్లుగా గుర్తించారు. ఇదివరకు అతను ఆటో రిక్షా నడిపినట్లుగా గుర్తించారు.
భక్త్ కాల్ వచ్చిన వెంటనే ఎఎపి నేత డిడి శర్మ పిసిఆర్కు సమాచారం అందించారని, పార్లమెంటు స్ట్రీట్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం భక్త్ను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించామన్నారు. కాగా, భక్త్ గతంలో ఎఎపిలో పని చేశాడని డిడి శర్మ గుర్తించారన్నారు.