వరుసగా 8వ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు వరుసగా 8వ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. పలు మెట్రో నగరాల్లో ఇంధనం ధరలు తగ్గాయి. బుధవారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 81.25 ఉండగా గురువారం రోజుకు అది 15 పైసలు తగ్గి రూ.81.10కి చేరింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.86.58 నుంచి రూ.86.73కు పడిపోయింది. ఇక చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ 84.28గా ఉంది. ఇక కోల్కతాలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను రివైజ్ చేశాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.82.95గా ఉంది.
ఇదిలా ఉంటే వ్యాట్ను తగ్గించాలని కోరుతూ ఢిల్లీలో కొద్దిరోజుల క్రితం 400 పెట్రోల్ పంపులను మూసివేశారు. అక్టోబర్ 22న ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 23 ఉదయం 5 గంటల వరకు పెట్రోల్ పంపులను మూసివేశారు. అయితే బీజేపీనే వెనకుండి బంద్ చేయిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ముంబైలో కూడా ధరలు ఎక్కువ ఉన్నాయని అక్కడ మాత్రం డీలర్లు బంద్ ఎందుకు పాటించడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నందున బంద్ పాటించరని ఆయన ధ్వజమెత్తారు.

ఇక గురువారానికి ఆయిల్ ధరలు ఒక శాతం తక్కువకు పడిపోయాయి. మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరల్లో లీటరకు రూ.1.73 తగ్గింది. ఈ ధరలు తగ్గుదల నమోదు చేయకముందు ఇంధనం ధరలు ఆకాశాన్నంటాయి. ముడిచమురు ధరల్లో పెరుగుదల నమోదు కావడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే సామాన్యుడికి కాస్త ఊరటనిస్తూ అక్టోబర్ 4వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఇంధనం ధరలపై రూ. 2.50 తగ్గిస్తూ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications