పీఓకే మనదే అయితే మౌనమెందుకు?
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, హత్యలపై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడి గళం విప్పాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఇటీవల పీవోకే జరిగిన సంఘటనలపై దృష్టి సారించాలని కోరారు. అది(పీవోకే) మనది అయితే మనం మౌనం ఉండలేమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)ను దేశంలో అంతర్భాగంగా పరిగణిస్తున్నప్పుడు.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న హత్యలు, కష్టాలపై గళం విప్పాలని ఫరూఖ్ అబ్దుల్లా కోరారు. జమ్మూ కాశ్మీర్లో విద్యార్థుల నిరసనలు, నిరుద్యోగం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఇటీవల భద్రతా దళాల అణచివేత చర్యలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పీఓకేలోని పరిస్థితిపై జోక్యం చేసుకుని పరిష్కరించాలని తాను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థలకు, అలాగే ప్రధానమంత్రికి, విదేశాంగ మంత్రికి పదేపదే విజ్ఞప్తి చేసినట్లు ఫరూఖ్ అబ్దుల్లా వెల్లడించారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి, పరిస్థితిని అంచనా వేసి, సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని తాను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ను కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై స్పందించాల్సిందిగా తాను ఇప్పటికే ప్రధానమంత్రికి, విదేశాంగ మంత్రికి కూడా పదే పదే అభ్యర్థనలు పంపినట్లు ఫరూఖ్ అబ్దుల్లా వెల్లడించారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)పై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వం తరచుగా ఆ ప్రాంతాన్ని భారత్లో అంతర్భాగంగా అభివర్ణిస్తుందని.. కానీ హత్యలు, ఆరోపిత మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం వహిస్తోందని ఆయన అన్నారు. "పీవోకే భారత్లో భాగమని వారు చెబుతూనే ఉంటారు. అది మనదేశంలో భాగమైతే, అక్కడ ఏం జరుగుతోందో మీరెందుకు మాట్లాడరు? హత్యలు ఆగాలని మీరెందుకు చెప్పరు? వారి నుంచి నేను ఎలాంటి ప్రకటన వినలేదు" అని ఫరూఖ్ అబ్దుల్లా వెల్లడించారు.
విద్యార్థుల నిరసనల గురించి ఫరూఖ్ అబ్దుల్లా ఏమన్నారంటే?
జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న విద్యార్థి నేతృత్వంలోని నిరసనల గురించి ప్రస్తావిస్తూ.. అధికారులు విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పైగా వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా, అరెస్టు చేసినా, వేధింపులకు గురిచేసినా ఉద్యమం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు చైతన్యవంతులయ్యారని, న్యాయమైన డిమాండ్ల కోసం వారు తమ పోరాటాన్ని ఆపబోరని అన్నారు. జమ్మూ కాశ్మీర్ యువతలపెరుగుతున్న మాదకద్రవ్యాల సమస్యపై ఫరూఖ్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications