కాశ్మీర్ వరదలు: ఆహారం లేక అలమటిస్తున్న మంత్రి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ను వరదలు మొంచెత్తున్నాయి. రాష్ట్రంలో 60 ఏళ్లలో ఇంత తీవ్రంగా వరదలు రావడం ఇదే మొదటిసారి. వరదల వల్ల రాష్ట్రంలో మృతుల సంఖ్య 120కి చేరింది. దక్షణి కాశ్మీర్లో వరదల్లో చిక్కుకున్న 11వేల మందిని సైన్యం రక్షించింది. వరదల కారణంగా ఇళ్లపైకి చేరిన వారిని సైనిక బృందాలు రక్షిస్తున్నాయి. సహాయకచర్యల్లో ఎన్టీఆర్ఎప్ సిబ్బందితోపాటుగా సైన్యం కూడా పాల్గొంటున్నాయి.
గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. జీలం, తావి, గంభీర్ నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండంతో పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిని కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఆయన ఏరియల్ సర్వే చేయనున్నారు.
జమ్మూ కాశ్మీర్ వరదలు సామాన్యులే కాక ప్రజాప్రతినిధులు కూడా వరదబారిన పడ్డారు. అనంతనాగ్లో వరదల్లో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జీఏ మీర్ చిక్కుకున్నారు. తన నియోజకమార్గంలో వరద పరిస్దితిని చూసేందుకు వెళ్లిన మంత్రి రెండురోజులుగా వరదలోనే చిక్కుకుపోయారు. ఇంటి చుట్టూ వరద నీరు రావడంతో ఆహారం, మందులు లేక కన్ బాల్ లోని తన నివాసంలో మంత్రి అలమటిస్తున్నారు.