షాహీన్బాగ్లో కాల్పులు జరిపిన యువకుడు బీజేపీలో చేరిక: గంటల్లోనే తొలగింపు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో తుపాకీతో కాల్పులు జరిపి సంచలనంగా మారిన 25 ఏళ్ల కపిల్ గుర్జర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో పార్టీ నేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు.
ఆ తర్వాత కపిల్ గుర్జర్ మాట్లాడుతూ.. హిందుత్వం కోసం పనిచేస్తున్న పార్టీ కావడంతో తాను బీజేపీలో చేరినట్లు తెలిపాడు. అయితే, అతడు పార్టీలో చేరిన గంటల సమయంలోనే అతడ్ని బీజేపీ పార్టీ నుంచి తొలగించడం గమనార్హం. అతడ్ని పార్టీలో చేర్చుకోవడం పొరపాటుగా జరిగిందని స్థానిక నేతలు చెప్పడం గమనార్హం.
సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్బాగ్లో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. పలుచోట్ల ఆందోళనకారులు విధ్వంసానికి కూడా పాల్పడ్డారు. అయితే, ఫిబ్రవరి 1న కపిల్ గుర్జర్ ఓ తుపాకీతో ఆందోళనకారులకు హెచ్చరికగా రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.
అనంతరం కపిల్ గుర్జర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరి వివాహ వేడుక సమయంలో ఢిల్లీ వీధుల్లో రాకపోకలకు అంతరాయం కల్పిస్తున్నారన్న కారణంతోనే తాను కాల్పులు జరిపినట్లు కపిల్ పోలీసులు విచారణలో వెల్లడించాడు. 2019 నుంచి తన తండ్రి.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారని చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు అతడి తండ్రి, కుటుంబసభ్యులు కూడా తోసిపుచ్చారు.