ఐఏఎస్ అధికారులకు అల్టిమేటం: జనవరిలోగా ఆస్తులు వెల్లడించకుంటే ‘నో’ ప్రమోషన్
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీవోపీటీ) అల్టిమేటం జారీ చేసింది. వచ్చే నెల నాటి(జనవరి 31, 2018)కి తమ ఆస్తుల వివరాలు ఇవ్వాలని, లేదంటే ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించి విజిలెన్స్ అనుమతులు నిలిపివేస్తామని డీవోపీటీ హెచ్చరించింది.
ఈ మేరకు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐఏఎస్లకు సూచించింది. దీని ప్రకారం 2018 జనవరి 31 నాటికి స్థిరాస్తులకు సంబంధించి రిటర్నులు (ఐపీఆర్) దాఖలు చేయాలని పేర్కొంది.

ఒకవేళ ఐపీఆర్ దాఖలు చేయకపోతే విజిలెన్స్ అనుమతులు నిలిపివేస్తామని అడిషనల్ సెక్రటరీ పీకే త్రిపాఠి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీవోపీటీ నిబంధనలు ఏప్రిల్ 4, 2011 ప్రకారం.. 2018 జనవరి 1 నాటికి ఐపీఆర్ దాఖలు చేయని అధికారులకు సంబంధించిన ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించిన విజిలెన్స్ అనుమతులను నిరాకరిస్తారు.
జనవరి 31లోపు ఆన్లైన్లో సంబంధిత వివరాలను ఐఏఎస్ అధికారులంతా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డీవోపీటీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,004 మంది ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications