జైట్లీకి బాధ్యతల విముక్తి: పరికర్కు రక్షణ శాఖ?
న్యూఢిల్లీ: రక్షణ శాఖకు పూర్తి స్థాయి మంత్రి నియామకం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందే ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తారని, ఈ సమయంలో పూర్తి స్థాయి రక్షణ మంత్రిని తీసుకుంటారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రక్షణ శాఖ ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్కు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అదనపు బాధ్యత కింద ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రక్షణ శాఖను నిర్వహిస్తున్నారు. ఐఐటి చదివిన పరికర్కు క్లీన్ ఇమేజ్ ఉండడమే కాకుండా ఉత్తమ పాలనాదక్షుడిగా పేరుంది.
సమస్యలను పరిష్కరించే సత్తా కలిగినవాడిగా, కఠిన లక్ష్యాలను సాధించే నేతగా ఆయనకు పేరుంది. అంతేకాకుండా నరేంద్ర మోడీకి ఆయన సన్నిహితుడు. బిజెపి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటింపజేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
పరికర్ బుధవారంనాడే ఢిల్లీకి చేరుకుని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలుస్తారని సమాచారం. మోడీ మంత్రి వర్గ విస్తరణలో మరో 12 మందికి అదనంగా స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు, హజారీబాగ్ ఎఁపి జయంత్ సిన్హాకు, హన్స్రాజ్కు మంత్రి పదవులు దక్కవచ్చునని అంటున్నారు.
పార్టీ కోసం విశ్వాసంతో పనిచేస్తున్న ముక్తార్ అబ్బాస్ నక్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీలను కూడా మోడీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్లకు కేబినెట్ హోదా ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.