బెంగాల్, అసోం ఎన్నికలకు భారీ భద్రత- మావోయిస్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతో పాటు పశ్చిమబెంగాల్లో ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు అన్ని చోట్లా కేంద్ర బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కేంద్రం తొలిసారిగా ఎన్ఆర్సీ అమలు చేసిన అస్సోంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తొలిదశ పోలింగ్ జరుగుతున్న 12 జిల్లాల్లో 264 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. వీరిలో సీఎం శర్భానంద్ సోనేవాల్తో పాటు పీసీసీ అధ్యక్షుడు రితిన్ బోరా, మరికొందరు వీఐపీలు ఉన్నారు. ఇక్కడ 81 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
అటు పశ్చిమబెంగాల్లోనూ తొలిదశ ఎన్నికల పోలింగ్పై ఉత్కంఠ నెలకొంది. తొలిదశలో భాగంగా ఎన్నికలు జరుగుతున్న ఐదు జిల్లాల్లో పలు ప్రాంతాలు మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నవి కావడంతో ఇక్కడ ఈసీ కేంద్ర బలగాలతో పాటు అదనపు భద్రతను మోహరిస్తోంది. ఈ ఐదు జిల్లాల్లోనే మొత్తం 732 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. తొలిదశ పోలింగ్ జరుగుతున్న 30 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పురూలియాలో 9, పూర్వ మిడ్నాపూర్లో 7, పశ్చిమ మిడ్నాపూర్లో 6, జార్ఘ్రామ్లో నాలుగు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ సందర్భంగా హింస తప్పదనే అంచనాలున్నాయి.