రెండెసివిర్,ఫవిపిరవిర్,ఫాబిఫ్లూ... సంతకం తీసుకున్నాకే డోసు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు....
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ వెలువడ్డ అధ్యయనాల ప్రకారం వ్యాక్సిన్ తయారీకి ఎంత లేదన్నా ఒక ఏడాది సమయం తప్పనిసరి. అయితే భారత్,అమెరికా,బ్రెజిల్ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో కొంతలో కొంత ఉపశమనం కలిగించేలా కోవిఫర్,రెండెసివిర్ సిప్రెమీ ఇంజెక్షన్లు, ఫాబిఫ్లూ అనే యాంటీ వైరల్ డ్రగ్ అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ 19 చికిత్సలో వీటిని ఉపయోగించనున్నారు. ఈ డ్రగ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం...

కోవిఫర్&సిప్రెమీ... రెండెసివిర్..
ఈ రెండు డ్రగ్స్ను సిప్లా,హెటిరో లాంచ్ చేశాయి. రెండెసివిర్ జనరిక్ వెర్షన్గా దీన్ని అభివృద్ది చేశాయి. రెండెసివిర్ అనే డ్రగ్ను నిజానికి 2014లో ఎబోలా చికిత్స కోసం మొదటిసారి తయారుచేశారు.ఇది శరీరంలో వైరస్ వృద్దిని నిరోధిస్తుంది. కోవిడ్ 19 పేషెంట్లపై రెండెసివిర్ ట్రయల్స్ డేటాను గత నెల అమెరికా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ అలర్జీస్&ఇన్ఫెక్షస్ డిసీజెస్ విడుదల చేసింది. రెండెసివిర్ ఇచ్చిన పేషెంట్లలో 11 నుంచి 15 రోజుల్లో వారి ఆరోగ్యం మెరుగైనట్టు తెలిపింది.

పేషెంట్ సంతకం తీసుకున్నాకే...
తేలికపాటి కోవిడ్ 19 లక్షణాలున్న పేషెంట్లపై మాత్రమే రెండెసివిర్ను ఉపయోగించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రెండెసివిర్ను ఉపయోగించాలని డీసీజీఐ ఆదేశాలిచ్చింది. అంతేకాదు,సదరు పేషెంట్ నుంచి సంతకం తీసుకున్నాకే.. ఈ డ్రగ్ను ఇవ్వాలని చెప్పింది. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ దీనిపై పేటెంట్ కలిగి ఉంది. భారత్లోని తయారీ సంస్థలకు వలంటరీ లైసెన్స్ ఇచ్చింది. దీనిపై హెటిరో సంస్థ మాట్లాడుతూ.. తాము అభివృద్ది చేసిన రెండెసివిర్ వెర్షన్ను ఒక వయల్కు రూ.5వేల నుంచి రూ.6వేలకు సప్లై చేస్తున్నట్టు తెలిపింది. ఈ లెక్కన ఒక పేషెంట్కు ఐదు రోజుల ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు రూ.30వేలుకు మించదని తెలిపింది. సిప్లా మాత్రం తాము అభివృద్ది చేసిన డ్రగ్ ధర గురించి ఇంతవరకూ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

వారికి ఈ డ్రగ్ ఇవ్వరు...
రెండెసివిర్ను ఇంజెక్షన్ రూపంలో కోవిడ్ 19 పేషెంట్లకు ఇవ్వనున్నారు. అయితే కాలేయ సంబంధిత వ్యాధులతో ఉన్నవారు,గర్భిణీ మహిళలు,12 ఏళ్ల లోపు చిన్నారుల చికిత్సకు దీన్ని ఉపయోగించరు. కోవిడ్ 19 క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెల్లడించింది. కేవలం తేలికపాటి లక్షణాలున్న కోవిడ్ 19 పేషెంట్లకు మొదటిరోజు 200మి.గ్రా చొప్పున దీన్ని అందిస్తారు. ఆ తర్వాత ఐదు రోజులు 100మి.గ్రా చొప్పున అందిస్తారు.

ఫాబిఫ్లూ ట్యాబ్లెట్...
కోవిడ్ 19 చికిత్స కోసం అందుబాటులోకి రాబోతున్న డ్రగ్స్లో ఫాబిఫ్లూ కూడా ఒకటి. ముంబైకి చెందిన గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్ ఫవిపిరవిర్ జనరిక్ వెర్షన్గా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జపాన్లో ఇన్ఫ్లుయెంజా చికిత్సలో దీన్ని ఇప్పటికే వాడుతున్నారు.ట్యాబ్లెట్ రూపంలో ఉండే ఈ డ్రగ్ను కేవలం తేలికపాటి కోవిడ్ 19 లక్షణాలు ఉన్నవారికి.. అది కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అందించాల్సి ఉంటుంది. అంతేకాదు,పేషెంట్తో ఆమోదంతో అతని/ఆమె సంతకం చేయించుకున్న తర్వాతే ఈ డ్రగ్ను ఇవ్వాల్సి ఉంటుంది.

ఫాబిఫ్లూ డోసు.. 14 రోజుల పాటు..
ప్రస్తుతం 18 క్లినికల్ ట్రయల్స్లో ఫవిపిరవిర్ను పరీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వెలువడ్డ రెండు అధ్యయనాలు మంచి ఫలితాలినిస్తున్నట్టుగా తెలిపాయి. మిగతా ట్రయల్స్ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. గ్లెన్మార్క్ మాత్రం ఫవిపిరవిర్ 88శాతం ఫలితాలనిస్తున్నట్టు తెలిపింది. కేవలం 4 రోజుల్లోనే శరీరంలోని వైరస్ లోడ్ను తగ్గించిందని ట్రయల్స్లో తేలిందని పేర్కొంది. ఫవిపిరవిర్ ట్యాబ్లెట్ మార్కెట్లో రూ.103కి అందుబాటులోకి రానుంది. మొదటిరోజు రెండుసార్లు చొప్పున 1800 మి.గ్రా డోసు,ఆ తర్వాతి 14 రోజులు రోజుకు రెండుసార్లు చొప్పున 800మి.గ్రా డోసు తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications