కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, మతం పేరుతో ఓట్లు, సుప్రీం కోర్టులో పిటిషన్: రద్దు చేయాలి!
న్యూఢిల్లీ: కర్ణాటక శాసన సభ ఎన్నికల వేడి సుప్రీం కోర్టుకు చేరింది. కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో భారత రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందని హిందూ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ సుప్రీం కోర్టులో దావా వేశారు.
కాంగ్రెస్ అభ్యర్థులు అనర్హులు
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మతం పేరుతో ఓట్లు అడిగారని, అందువలన రాష్ట్రంలోని అన్ని శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ప్రమోద్ ముతాలిక్ సుప్రీం కోర్టులో మనవి చేశారు.
మతం పేరుతో పథకాలు
కర్ణాటక ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పలు పథాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే మతాలను విడదీస్తూ పథకాలు పంచిపెట్టారని ప్రమోద్ ముతాలిక్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముస్లీంలు, మైనారిటీలు
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లీంలు, మైనారిటీ ఓట్లు అడుగుతూ వారికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారని, భారత రాజ్యంగం ప్రకారం అది నేరమని హిందూ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. అర్జీని స్వీకరించిన సుప్రీం కోర్టు మే 10వ తేదీ గురువారం విచారణ చేస్తామని చెప్పింది.
రాహుల్ గాంధీ
మే 12వ తేదీన కర్ణాటకలో శాసన సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు ప్రత్యేక పథకాలు, ప్యాకేజీలు ప్రవేశ పెడుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు గుప్పించింది.