IIT-JEE : కోటాలో ఆగని ఐఐటీ అభ్యర్ధుల ఆత్మహత్యలు.. ! ఈ ఏడాది 20 దాటేసిన వైనం..
రాజస్తాన్ లోని కోటాలో ఐఐటీ-జేఈఈ ఎంట్రన్స్ పరీక్షకు కోచింగ్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యర్ధుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పలువురు ఐఐటీ కోచింగ్ కు వచ్చిన అభ్యర్ధులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా బీహార్ నుంచి కోచింగ్ కోసం వచ్చిన మరో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అసలు ఐఐటీ కోచింగ్, విద్యార్ధుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి.
ఐఐటీ కోచింగ్ హబ్ కోటాలో నిన్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది మొత్తం ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 20కి చేరింది. బీహార్లోని గయకు చెందిన 18 ఏళ్ల బాల్మీకి ప్రసాద్ నిన్న రాత్రి కోటాలో మహావీర్నగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. ఇంటి యజమాని ఇతర విద్యార్థులతో కలిసి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

నిన్న రాత్రి 8 గంటల సమయంలో అద్దె వసతి గృహంలో ఆ విద్యార్ధి పక్కనే నివసించే విద్యార్థులు అతని తలుపు తట్టారు. కానీ సమాధానం రాలేదు. దీంతో కిటికీల నుంచి చూశారు. దీంతో తన గదిలో విద్యార్ధి వేలాడుతున్నట్లు గుర్తించిన వారు ఇంటి యజమానికి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఎదురుచూస్తున్నట్లు స్ధానిక మహావీర్ నగర్ పోలీసులు తెలిపారు.

అలాగే విద్యార్ది నివసిస్తున్న గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఇంటి యజమానితో పాటు ఇంట్లో నివసిస్తున్న ఇతర విద్యార్థులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ది రెండేళ్లుగా ఇక్కడే ఉంటూ ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్నట్లు తేలింది. అలాగే కోటాలో ఈ నెలలో నమోదైన నాలుగో విద్యార్థి ఆత్మహత్య ఇది. ఇద్దరు ఐఐటీ-జేఈఈ అభ్యర్ధులు, ఓ నీట్ యూజీ అభ్యర్ధి సహా మరో ముగ్గురు కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఈ నెలలోనే మరణించారు. గతేడాది కోచింగ్ హబ్లో కనీసం 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications