ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో అనూహ్య మలుపు: సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ చేతికి దర్యాప్తు!
చెన్నై: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసు గురువారం అనూహ్యంగా మలుపు తీసుకుంది. ఈ కేసు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ చేతికి చేరింది. నిష్పాక్షిక దర్యాప్తులో భాగంగా ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించినట్లు చెన్నై నగర పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ తెలిపారు. ఫాతిమా ఆత్మహత్య చేసుకున్న స్థలాన్ని గురువారం ఉదయం ఆయన పరిశీలించారు. కేసు దర్యాప్తులో పోలీసులు పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఫాతిమా కుటుంబ సభ్యుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కేసును బదలాయించినట్లు చెప్పారు.

క్యాంపస్ ఆవరణలో ఆత్మహత్య
కేరళలోని కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ ఐఐటీ-మద్రాస్ లో పీజీ చేస్తున్నారు. క్యాంపప్ ఆవరణలోని సరయూ హాస్టల్ లో రెండు రోజుల కిందట ఆమె ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం 11:30 గంటలకు కూడా ఆమె గది తలుపులు తెరవక పోవడంతో తోటి విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులగొట్టి చూడగా.. ఫ్యాన్ కు ఆమె నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు. మూడేళ్ల కాలంలో ఐఐటీ-ఎం క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది కొట్టూర్ పురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

లైంగిక వేధింపులే కారణమంటూ..
తన కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రొఫెసర్ల వేధింపులే కారణమంటూ ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్, తల్లి సాజిదా లతీప్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని వారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అన్నారు. ఐఐటీ-మద్రాస్ ప్రొఫెసర్లు తమ కుమార్తెను ఆత్మహత్య చేసుకునే స్థాయిలో వేధింపులకు గురి చేసి ఉంటారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఫాతిమా తరచూ తన దృష్టికి తీసుకుని వచ్చేదని, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా తనకు మెసేజ్ చేసిందని అన్నారు. దీన్ని తాను కొట్టూర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవట్లేదని అన్నారు.
Recommended Video

స్పందించిన కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం..
ఈ కేసుపై కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సమగ్ర దర్యాప్తు చేయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. తమిళనాడు హోం మంత్రిత్వ శాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు. వారి ఆదేశాల మేరకు చెన్నై నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఐఐటీలోని ప్రొఫెసర్లతో పాటు ఫాతిమా స్నేహితులను పోలీసులు విచారించారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టడానికి వీలుగా ఈ కేసును బదలాయించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications