భారత వాతావరణ శాఖ శుభవార్త
నైరుతి రుతుపవనాలు మనల్ని ముద్దాడే సమయం దగ్గర పడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రాన్ని జూన్ నాలుగోతేదీన తాకుతాయని అంచనా వేస్తున్నారు. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.
వాయవ్య దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే రెండురోజులు తెలంగాణలోని దక్షిణ, తూర్పు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవబోతున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లా అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతోంది. దామచర్లలో దామరచర్లలో 45.4, నేరేడుగొమ్ములో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది.

కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.4, నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు, మంచిర్యాల, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీల నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండుతున్న ఎండల తీవ్రతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో మృత్యువాత పడ్డారు. తన్నీరు మనోహర్(47), బేతం చిన్ని(56), అచ్చె రామారావు(74) ఎండదెబ్బకు మృతి చెందారు. మహబూబాబాద్ శివారులోని గాంధీపురంలో వ్యవసాయ కూలి గండమల్ల వెంకటయ్య(67), హైదరాబాద్లోని ఫతేనగర్లో శివాలయం రోడ్లోని జామియా మసీద్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి(55) వడదెబ్బతో మరణించారు.












Click it and Unblock the Notifications