బాబర్ ఆజమ్ అయిపోయాడు- రిజ్వాన్కూ కేంద్రం షాక్
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
పహల్గామ్లో చోటు చేసుకున్న మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఇందులో ప్రధానమైనవి- దేశంలో నివసించే పాకిస్తానీయులను బహిష్కరించడం. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్పోస్ట్ను తక్షణమే మూసివేయడం.

దీనితో పాటు పాకిస్తాన్కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ వెబ్సైట్లనూ నిషేధించింది. ది డాన్, జియో టీవీ, ఏఆర్వై న్యూస్, సమా టీవీ, బోల్ న్యూస్ వంటి మీడియా హౌస్కు చెందిన యూట్యూబ్ ఛానళ్ల భారత్లో పని చేయట్లేదు. వాటి కార్యకలాపాలు స్తంభించిపోయాయి. నిషేధానికి గురయ్యాయి.
అక్కడితో దీనికి బ్రేక్ పడలేదు. ఒకరిద్దరు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల యూట్యూబ్ ఛానళ్లనూ నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్, షహీన్ షా అఫ్రిదీ యూట్యూబ్ ఛానళ్లు భారత్లో ఇదివరకే నిషేధానికి గురయ్యాయి. భారత్పై దుష్ప్రచారం చేస్తోన్నారనే కారణంతో వారిద్దరికీ అలా షాక్ ఇచ్చింది కేంద్రం.
ఇప్పుడు తాజాగా మరి కొందరు పాకిస్తాన్ క్రికెటర్లు ఈ జాబితాలో చేరారు. వారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు నిషేధానికి గురయ్యాయి. పాక్ మాజీ కేప్టెన్ బాబర్ ఆజమ్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే Account not available in India అని కనిపిస్తోంది.
బాబర్ ఆజమ్ మాత్రమే కాదు.. పాకిస్తాన్ కేప్టెన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, బౌలర్ హ్యారిస్ రవూఫ్, మాజీ క్రికెటర్లు షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్ ఇన్స్టాగ్రామ్లు కూడా భారత్లో పని చేయట్లేదు. పాకిస్తాన్ ఒలింపిక్ బంగారు పతకం గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్స్టాగ్రామ్ సైతం సస్పెండ్ అయింది. వసీం అక్రమ్, వకార్ యూనిస్ ఇన్స్టా.. యాక్టివ్గా ఉంటోన్నాయి.












Click it and Unblock the Notifications