ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్: భారత్లో తగ్గిన అవినీతి, దిగజారిన చైనా, అమెరికా
న్యూఢిల్లీ: భారత్లో అవినీతి తగ్గుముఖం పడుతోంది. ఈ మేరకు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తన వార్షిక నివేదిక-2018లో వెల్లడించింది. చైనా, పాకిస్తాన్ కంటే భారత్లో అవినీతి తగ్గుతోందని, ఇక్కడ చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ప్రపంచ దేశాల అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏటా అధ్యయనం చేసి, విడుదల చేస్తుంది.
78వ స్థానంలో భారత్
ఈ నివేదికలో 180 దేశాల్లో అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 78 స్థానంలో నిలిచింది. చైనా 87, పాకిస్తాన్ 117వ స్థానంలో ఉంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్.. అవినీతి స్కేల్ను జీరో నుంచి 100 వరకు కొలుస్తారు. జీరో వస్తే అవినీతి బాగా ఉందని అర్థం. వంద పాయింట్లు వస్తే అవినీతిరహిత దేశంగా పేర్కొంటారు. ఈ ఏడాది మూడింట రెండు వంతుల దేశాల స్కోర్ 50 కంటే తక్కువగా వచ్చాయి.
గత ఏడాది కంటే మూడు పాయింట్లు మెరుగు
2017లో భారత్ స్కోర్ 40గా ఉంది. ఈ ఏడాది 41కి చేరింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అవినీతిలో భారత్ ర్యాంక్ గతంలో కంటే మెరుగుపడటం మంచి పరిణామమని అంటున్నారు. భారత్లో అవినీతిని తగ్గిస్తామని బీజేపీ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఇప్పుడు ఈ సూచికలు అందుకు అనుగుణంగా కనిపిస్తున్నాయి. భారత్ 2017లో 81వ స్థానంలో ఉండగా మూడు పాయింట్లు మెరుగుపడి ఇప్పుడు 78కి చేరుకుంది. అప్పుడు 40 పాయింట్లు రాగా, ఇప్పుడు 41 పాయింట్లు వచ్చాయి. ప్రపంచ సగటు 43 పాయింట్లుగా ఉంది.
వెనుకబడిన చైనా, అమెరికా
2017లో 75 పాయింట్లతో ఉన్న అమెరికా ఇప్పుడు 71 పాయింట్లతో 22వ స్థానానికి పడిపోయింది. చైనా ఏకంగా పది ర్యాంకులు తగ్గింది. 77వ ర్యాంకు నుంచి 87వ ర్యాంకుకు దిగజారింది. అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్లు ఉన్నాయి. ఈ దేశాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా, సౌత్ సూడాన్, సోమాలియాలు అట్టడుగున ఉన్నాయి. భారత్, మలేసియా, పాకిస్తాన్, మాల్దీవుల్లో అవినీతి వ్యతిరేక చర్యలు అనేకం తీసుకున్నప్పటికీ వాటి ర్యాంకుల్లో ఆ మేరకు పెరుగుదల కనిపించలేదని అంటున్నారు.