మొగల్లను ఓడించిన ముస్లిం యోధుడు 'బాఘ్ హజారికా'ను కల్పిత పాత్రగా బీజేపీ చిత్రీకరిస్తోందా?
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరో వివాదానికి కారణమయ్యారు.
చరిత్రలో ప్రముఖంగా కనిపించే సరాయ్ఘాట్ యుద్ధంలో మొగలులను ఓడించిన అహోమ్ సైన్యంలో భాగమైన ముస్లిం యోధుడు ఇస్మాయిల్ సిద్ధికీ ఉనికిని ప్రశ్నించడం ద్వారా ఆయన తాజా వివాదాన్నిరేకెత్తించారు.
ఇస్మాయిల్ సిద్ధికీని అస్సాంలో బాఘ్ హజారికా పేరుతో పిలుస్తారు.
సరాయ్ఘాట్ యుద్ధంలో మొగలులకు వ్యతిరేకంగా అహోమ్ జనరల్ లచిత్ బర్ఫుకన్ నేతృత్వంలో పోరాడారని చెబుతోన్న బాఘ్ హజారికా ఒక 'కల్పిత పాత్ర’ అని హిమంత బిస్వా శర్మ అన్నారు.
ఈ వ్యాఖ్యపై ముస్లిం సమాజం తీవ్రంగా స్పందించింది. దీన్ని 'కమ్యూనల్’ అని అభివర్ణించింది. ఈ వివాదంపై బాఘ్ హజారికా వారసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై అస్సాం ముస్లిం నేతల్లోని ఒక వర్గం మాట్లాడుతూ, ''అస్సాం సమాజాన్ని విభజించడానికి రైట్ వింగ్ చేసిన కుట్రగా దీన్ని చూస్తున్నాం’’ అని అన్నారు.
జనవరి 8న గువాహటిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సదస్సులో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడారు. ''ఒకవేళ మీరు సరాయ్ఘాట్ యుద్ధానికి సంబంధించిన పూర్తి చరిత్రను చదివితే, మీకు ఎక్కడా బాఘ్ హజారికా ప్రస్తావన కనిపించదు’’ అని అన్నారు.
జనవరి 12న భారతీయ జనతా యువ మోర్చా కార్యక్రమంలో హిమంత బిస్వా శర్మ మరోసారి ఈ మాటలను పునరుద్ఘాటించారు.
https://twitter.com/himantabiswa/status/1613466452291649536
సరాయ్ఘాట్ యుద్ధం
బాఘ్ హజారికా వంశంలోని 10వ తరానికి చెందిన 83 ఏళ్ల అహ్మద్ హజారికా ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
''సరాయ్ఘాట్ యుద్దం జరిగి 350 ఏళ్లకు పైగా గడిచాయి. ఇప్పటివరకు ఎవరూ అలాంటి వివాదాన్ని రాజేయలేదు’’ అని ఆయన అన్నారు.
''బాఘ్ హజారికా ఒక ముస్లిం యోధుడు. అందుకే ఆయన పాత్రను చరిత్ర నుంచి చెరిపేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజా వివాదం మా మనస్సులో ఈ సందేహాన్ని రేకెత్తించింది’’ అని ఆయన చెప్పారు.
సరాయ్ఘాట్ యుద్ధం 1671లో జరిగింది. అహోమ్ రాజ్యం, మొగల్ సామ్రాజ్యాల మధ్య సరాయ్ఘాట్ (ఇప్పుడు గువాహటి) సమీపంలోని బ్రహ్మపుత్ర నదిపై జరిగిన నౌకా యుద్ధం ఇది.
ఆ యుద్ధంలో అహోమ్ సైన్యానికి లచిత్ బర్ఫుకన్ నేతృత్వం వహించగా, మొగల్ సైన్యానికి రామ్ సింగ్ ముఖ్య సైన్యాధిపతిగా వ్యవహరించారు.
స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే, 1947లో అస్సాం ప్రభుత్వం, ప్రసిద్ధ చరిత్రకారుడు సూర్య కుమార్ భూయాన్ రచించిన 'లచిత్ బర్ఫుకన్ అండ్ హిజ్ టైమ్స్’ అనే పుస్తకాన్ని ప్రచురించింది.
లచిత్ బర్ఫుకన్పై సూర్యకుమార్ ఈ పుస్తకాన్ని రాశారు. అహోమ్ రాజ్య నౌకాదళాన్ని నడిపించే బాధ్యతను బాఘ్ హజారికా అంటే ఇస్మాయిల్ సిద్ధికీకి అప్పగించినట్లు ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
చరిత్రకారులు డాక్టర్ లీలా గొగొయ్, భువన చంద్ర హాండిక్ వంటివారు కూడా తమ పుస్తకాల్లో బాఘ్ హజారికా ప్రస్తావన తెచ్చారు.
నిజానికి అస్సాం చరిత్రలో, ముఖ్యంగా స్వదేశీ అస్సామీ ముస్లిం సమాజంలో బాఘ్ హజారికా వీరత్వానికి సంబంధించిన కథలు గణనీయమైన సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి.
కానీ, అస్సాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం, హిందూ యోధుడు లచిత్ బర్ఫుకన్ కథకు మాత్రమే ప్రచారం కల్పిస్తోంది.
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- మంగళ్ పాండే: 1857 సిపాయిల తిరుగుబాటుకు నెల రోజుల ముందు ఏం జరిగింది?
నిపుణులు ఏం అంటున్నారు?
అస్సాంలో బీజేపీ రాజకీయాలను అర్థం చేసుకున్న నిపుణులు దీని గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం యోధుడు బాఘ్ హజారికా కథ, బీజేపీ హిందుత్వ రాజకీయాలకు సరిపోదని వారు అంటున్నారు. ఈ తాజా వివాదాన్ని వారు హిందు వర్సెస్ ముస్లిం రాజకీయాలతో ముడిపెట్టి చూస్తున్నారు.
అస్సాం రాజకీయాలను సుదీర్ఘ కాలంగా చూస్తోన్న సీనియర్ జర్నలిస్ట్ బైకుంఠ్ నాథ్ గోస్వామి తాజా వివాదంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
''అస్సాంలో మతరాజకీయాలకు పాల్పడేవారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు వారికి కనిపించడం లేదు. అస్సాం అనేది హిందువుల రాజ్యం అని, ఇది మొగలుల చేతుల్లోకి వెళ్లకుండా లచిత్ బర్ఫుకన్ కాపాడారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హిందువులకు అర్థమయ్యేలా వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొగలులపై బాఘ్ హజారికా పోరాట కథలు చాలామంది చరిత్రకారుల పుస్తకాల్లో ఉన్నాయి. ఈ రకమైన వివాదాలను ఒకరకంగా ముస్లింలకు, హిందువులకు మధ్య విభేధాలు సృష్టించే రాజకీయాల్లో ఒక భాగంగా చెప్పవచ్చు. ఇలాంటి రాజకీయాలు చేస్తూ హిమంత బిస్వా శర్మ తన పార్టీకి, ఆర్ఎస్ఎస్కు మరింత విధేయుడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని, తెగిపడిన తలలెన్ని?
ముస్లిం నిపుణులు దృష్టిలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
నిజానికి సరాయ్ఘాట్ యుద్ధాన్ని భారతయ చరిత్రలో ఒక కీలక మలుపుగా భావిస్తారు.
రాజకీయ కార్యకర్త మెహదీ ఆలమ్ బోరా ఈ వివాదం గురించి మాట్లాడారు.
''ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. బాఘ్ హజారికా పేరు అస్సాం చరిత్రలో నిలిచిపోయింది. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే, అనవసర వివాదాలు సృష్టించే బదులు దీనిపై మరింత పరిశోధన చేసి నిజానిజాలు తెలుసుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.
బాఘ్ హజారికా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం అస్సాం యూనివర్సిటీ పరిధిలో చరిత్రకారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ జనవరి 11న అస్సామీ ముస్లిం మేధావుల సమూహం ఒక ప్రకటన జారీ చేసింది.
ఈ వివాదంపై 'సదౌ అసోమ్ గోరియా మోరియా దేశీ జాతీయ పరిషద్’ అధ్యక్షుడు నరుల్ హక్ మాట్లాడారు.
''ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, హజారికా మీద చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ ఎజెండాలో భాగం. ఎందుకంటే అంతకుముందు అస్సాంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బీజేపీ పార్టీకి చెందిన సర్బానంద సోనోవాల్, అస్సాం అసెంబ్లీలో మాట్లాడుతూ సరాయ్ఘాట్ యుద్ధంలో లచిత్ బర్ఫుకన్తో పాటు హజారికా కూడా కీలక పాత్ర పోషించారని అనడం రికార్డుల్లో ఉంది.
దీని తర్వాత బీజేపీ ప్రభుత్వం 2016లో లచిత్ దివస్ను పురస్కరించుకొని పంచిపెట్టిన ఆహ్వాన లేఖల్లో లచిత్ బర్ఫుకన్తో పాటు బాఘ్ హజారికా ఫొటో కూడా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి హజారికాను కల్పిత పాత్ర అని చెప్పడం అసమంజసం.
నిజానికి లచిత్ బర్ఫుకన్ను హిందూ యోధుడిగా ప్రజల్లో చిత్రీకరించేందుకు ఇదంతా చేస్తున్నారు. అందుకే బాఘ్ హజారికా పాత్రను తుడిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, అస్సాం నుంచి బాఘ్ హజారికాను తొలిగించడం, కల్పిత పాత్రగా మార్చడం ఎప్పటికీ సాధ్యం కాదు’’ అని ఆయన వివరించారు.
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఔరంగాబాద్లో ఎందుకు నిర్మించారు?
బాఘ్ హజారికా అస్తిత్వంపై ప్రశ్నలు
అహోమ్ కమాండర్ లచిత్ బర్ఫుకన్ను హిందూ జాతీయవాద హీరోగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీపై అస్సాంలో ఆరోపణలు ఉన్నాయి.
గత ఏడాది నవంబర్ 24న లచిత్ బర్ఫుకన్ 400వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించిన తీరుపై పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
దిల్లీలోజరిగిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
దేశంలో ఛత్రపతి శివాజీకి దక్కినంత గౌరవం అహోమ్ జనరల్ లచిత్ బర్ఫుకన్ను దక్కలేదని, ఆయనను సముచితంగా గౌరవించేందుకే ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అప్పుడు హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.
- తాన్సేన్ సమాధి మీద మొలిచిన బెర్రీ చెట్టు ఆకులు తింటే గొంతు మధురంగా మారుతుందా?
- తాజ్ మహల్: షాజహాన్ అమర ప్రేమకథలో ట్విస్టు.. ముంతాజ్ మహల్తో నిశ్చితార్థం, మరో యువరాణితో పెళ్లి
అస్సాం తై అహోమ్ యూత్ కౌన్సిల్ కార్యదర్శి దీప్జ్యోతి ఈ వివాదం గురించి మాట్లాడారు.
''మన యోధులను ఏ రకంగానూ రాజకీయాల్లో ఉపయోగించకూడదు. బాఘ్ హజారికా కల్పిత పాత్ర కాదు. ఒక నిజమైన వ్యక్తి. ఎందుకంటే తై అహోమ్కు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. మాకు ఆ చరిత్రపై పూర్తి నమ్మకం ఉంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక యోధున్ని కల్పిత పాత్ర అని మీరు చెబితే అది నిజమై పోదు. అహోమ్ యోధుడు లచిత్ బర్ఫుకన్, హిందువు కాదనే విషయం అందరికీ తెలుసు. అతను ఒక అహోమ్’’ అని ఆయన అన్నారు.
డిబ్రూగడ్ హనుమాన్ బక్ష్ సూరజ్మల్ కనోయ్ కాలేజీ ప్రొఫెసర్, చరిత్రకారుడు అభిజీత్ బరువా ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.
''సరాయ్ఘాట్ యుద్ధంలో అస్సాం ముస్లింల పాత్రను విస్మరించకూడదు. కానీ, వ్యక్తిగతంగా నేను బాఘ్ హజారికా అనే పాత్ర లేదని నమ్ముతున్నా. హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం కోసం కొంతమంది తమ పుస్తకాల్లో ఆయన పాత్ర గురించి ప్రస్తావించి ఉంటారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
- తాజ్మహల్కు పొదిగిన 40 రకాల రత్నాలను ఆంగ్లేయులు దోచుకెళ్లారా
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్లోకి ఎలా వచ్చాయి?
అస్సాంలో అహోమ్ పాలన
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, బాఘ్ హజారికా గురించి మాట్లాడుతూ, ''సరాయ్ఘాట్ యుద్ధం గురించి మనకు ఎవరూ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. కేవలం వామపక్షాలు మాత్రమే యుద్ధంలో ఒకమైపు లచిత్, బాఘ్ హజారికా మరోవైపు ఔరంగజేబు, రామ్ సింగ్ ఉన్నారని చెప్పాలని చూశాయి’’ అని అన్నారు.
బాఘ్ హజారికాపై మతపరమైన రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలకు అస్సాం బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ గుప్తా స్పందించారు.
''మా ముఖ్యమంత్రి చెప్పినది అక్షరాల నిజం. ఈ వివాదాన్ని అనవసరంగా పెద్దదిగా చేయాలని చూస్తున్న వారంతా ఒకసారి చరిత్ర పుస్తకాలను సరిగ్గా చదివి అర్థం చేసుకోవాలి. మా పార్టీ ఏ రకంగానూ మతరాజకీయాలను చేయదు. మేం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతాం’’ అని ఆయన అన్నారు.
అస్సాంలో 13వ శతాబ్ధంలో అహోమ్ రాజవంశం ఆధిపత్యం ప్రదర్శించిందని చరిత్ర పుస్తకాల్లో రాసి ఉంది.
తై రాజవంశం శాన్ శాఖకు చెందిన అహోమ్ యోధులు, సుఖాపా నేతృత్వంలో స్థానికంగా ఉండే నాగాలపై గెలుపొంది ప్రస్తుతం అస్సాంగా పిలుస్తున్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత 600 ఏళ్ల పాటు అస్సాంలో వారి పాలన సాగింది.
ఇవి కూడా చదవండి:
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- ఈ దేశంలో చికెన్ కన్నా ఉల్లిపాయల ధర మూడు రెట్లు ఎక్కువ... కిలో రూ. 890
- జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?
- కేసీఆర్: విశాఖ ఉక్కును మోదీ అమ్మితే... మేం మళ్లీ తీసుకొస్తాం
- మెదక్: తన పేరు మీద రూ.7 కోట్లకు బీమా... 'తన లాంటి వ్యక్తిని చంపేసి తానే చనిపోయినట్లు నాటకం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)