"హవాలా" తుట్టె కదిలించిన ఐటీ శాఖ.. 25 కోట్ల నగదు స్వాధీనం
ఢిల్లీ : హవాలా తుట్టె కదిలించారు ఐటీ శాఖ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ రాకెట్ చేధించారు. చాందినీ చౌక్ ఏరియాలో ఓ ప్రైవేట్ సంస్థపై అధికారులు దాడిచేయడంతో హవాలా భాగోతం గుట్టురట్టైంది. అక్రమంగా నిర్వహిస్తున్న వందకు పైగా లాకర్లను తెరిపించారు. 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని చెబుతున్నారు ఐటీ అధికారులు. హవాలాతో అక్రమ లావాదేవీలు నిర్వహించేవారు ఇలాంటి ప్రైవేట్ లాకర్లలో నగదు నిల్వలు దాచిపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ సొమ్ము ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులదయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో సాగే ఈ దందాలో హవాలా బ్రోకర్లకు పలువురితో సంబంధాలుంటాయని తెలిపారు.
హవాలా ద్వారా డబ్బు రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు అక్రమార్కులు. ఇలాంటి భారీ లాకర్ ఆపరేషన్లలో భాగంగా ఈ ఏడాదిలోనే ఇది మూడో సంఘటన కావడం గమనార్హం.