"ఎద్దుల" పోటీకి వరల్డ్ రికార్డు.. గిన్నిస్లోకి "జల్లికట్టు".. మరోవైపు విషాదం
Recommended Video
చెన్నై : ఎద్దుల పోటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ సాహస క్రీడ వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడంతో తమిళనాట హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇద్దరు వ్యక్తులు చనిపోవడం విషాదం నింపింది.
జల్లికట్టు రికార్డు.. గిన్నిస్లో చోటు
తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా ప్రతి యేటా జరిగే జల్లికట్టు ఈసారి రికార్డు సృష్టించింది. జంతువులకు హానికరమంటూ అప్పట్లో ఈ ఎద్దుల పోటీని అడ్డుకోవాలని చాలామంది చూశారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఏ ఏడాదికాయేడు జల్లికట్టుపై ఇంట్రెస్ట్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ సంవత్సరం ఎలాగైనా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాలనే ప్రయత్నం చేశారు నిర్వాహకులు.
పుదుక్కొట్టాయ్, తిరుచి, మధురై నుంచి ఎద్దులను తరలించారు. గిన్నిస్ రికార్డు క్రియేట్ 2000 ఎద్దులను రంగంలోకి దించాలని చూసినా వీలుపడలేదు. చివరకు 1,354 ఎద్దులను బరిలోకి తెచ్చారు. వీటిని అదుపుచేసేందుకు 424 మంది వ్యక్తులను మాత్రమే మైదానంలోకి అనుమతించారు. జల్లికట్టును ఆద్యంతం తిలకించారు గిన్నిస్ ప్రతినిధులు. ఈమేరకు గిన్నిస్ రికార్డులో చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించి నిర్వాహకులకు సర్టిఫికెట్ అందించారు.
ఎద్దులను అదుపుచేసిన కొందరిని విజేతలుగా ప్రకటించి బహుమతులు అందించారు నిర్వాహకులు. ఎద్దులను తీసుకొచ్చిన యజమానులకు సైతం గిఫ్టులిచ్చారు. 2 కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, బంగారు, వెండి నాణేలు, గృహోపకరణాలు తదితర బహుమతులు ప్రకటించారు.
ఇన్సూరెన్స్ సదుపాయం
జల్లికట్టు నిర్వహణలో భాగంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది తమిళనాడు ప్రభుత్వం. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా సొమ్ము అందుతుంది. అంతేకాదు ఎద్దులను నిలువరించడానికి వచ్చిన వారు గాయాలపాలవుతారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించారు.
ఇద్దరు మృతి.. విషాదం
జల్లికట్టు క్రీడలో భాగంగా ఎద్దులను నివారించే క్రమంలో ప్రతిఏటా విషాదం నెలకొంటుంది. ఈసారి కూడా ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చిన రాము, సతీష్ అనే యువకుల పైకి ఎద్దులు దూసుకురావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముప్పై మంది గాయపడ్డారు.