యుద్ధం ఆరంభం: గాంధీగిరి తరహాలో: యూట్యూబ్ లైవ్ ద్వారా క్రైస్తవుల ప్రార్థనలు..!
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్పై దేశ ప్రజలు యుద్ధాన్ని ఆరంభించారు. కత్తులు, కటార్లు పట్టుకుని దండయాత్రగా సాగే యుద్ధం కాదిది. స్వచ్ఛందంగా తమను తాము స్వీయ గృహనిర్బంధంలో ఉంటూ.. వైరస్ బారిన పడకుండా ఉండటానికి గాంధీ గిరీ తరహాలో భారతీయులు చేపట్టిన ఆధునిక పోరాటం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలందరూ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లిపోయారు. స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు.

ఏకతాటిపైకి చేరిన భారత్..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్పై మనదేశం ఆరంభించిన మొట్టమొదటి యుద్ధంగా దీన్ని అభివర్ణించవచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే భయానకంగా విస్తరిస్తోన్న మహమ్మారిని తరిమి కొట్టడానికి దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. ఐక్యంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఎవరూ బయటకు రాలేదు. ఆదివారం కావడం కలిసి వచ్చింది. దేశ ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫలితంగా- దేశం మొత్తం మూగబోయినట్టు కనిపిస్తోంది.

ప్రధాన రహదారులు.. పర్యాటక కేంద్రాలు..
రోజూ లక్షలాది వాహనాలు తిరుగాడే రహదారులన్నీ బోసిపోయాయి. ఏ ఒక్క వాహనం కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపించట్లేదు. అప్పుడప్పుడూ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బందికి సంబంధించిన ఒకటి, అరా వాహనాలు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. పర్యాటక కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు ఇదివరకే మూతపడ్డాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు నాలుగు రోజుల కిందటే క్లోజ్ అయ్యాయి. దుకాణాలు, మార్కెట్లు తెరచుకోలేేదు.

యూట్యూబ్లో క్రైస్తవ ప్రార్థనలు
క్రైస్తవులకు ఆదివారం పవిత్రమైన రోజు. తెల్లవారు జాము నుంచే వారు చర్చిల్లో ప్రార్థనలను కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం జనతా కర్ఫ్యూను దృష్టిలో ఉంచుకుని చర్చిల్లో సామూహిక ప్రార్థనలను రద్దు చేశారు. దాని స్థానంలో యుట్యూబ్ లైవ్ ద్వారా ప్రార్థనలను కొనసాగిస్తున్నారు. ఎవరి ఇళ్లల్లో వాళ్లు.. యుట్యూబ్లో లైవ్లో ప్రార్థనలు చేసుకోవాలని సూచించినట్లు మద్రాస్-మైలాపోర్ ఆర్చిబిషప్ జార్జ్ ఆంథొని స్వామి తెలిపారు. ఎవరూ చర్చికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు

24 గంటల బంద్..
తెలంగాణ ప్రభుత్వం 24 గంటల పాటు జనతా కర్ఫ్యూను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ 14 గంటల వరకు మాత్రమే కొనసాగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 6 గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా తెలంగాణ అడుగులు వేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జనసంచారం కనిపించట్లేదు. కొన్ని ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications