కర్ణాటకలో 108 అంబులెన్సులు బంద్: డీకే శివకుమార్ సర్కార్ కు 15 రోజుల డెడ్ లైన్
కర్ణాటకలో అత్యవసర సర్వీసులకు తీవ్ర విభాగం కలిగే పరిస్థితులు కనిపిస్తోన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్య కవచ పథకంలో భాగమైన 108 అంబులెన్స్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. వేతనాల సవరణతో పాటు అనేక పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20వ తేదీ నుంచి సామూహిక రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
సువర్ణ కర్ణాటక ఆరోగ్య కవచ-108 ఉద్యోగుల సంఘం, కర్ణాటక ఆరోగ్య కవచ అంబులెన్స్ ఉద్యోఘుల సంఘం సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. ఈ మేరకు తమ సమస్యలను వివరిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శికి లేఖలు పంపాయి. ప్రస్తుతం జీవీకే సంస్థ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు అంబులెన్స్ సేవల్లో కీలక పాత్ర పోషిస్తోన్నారు. పరిష్కారించడానికి ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చాయి.

అంబులెన్స్ సిబ్బంది ప్రధానంగా తమ వేతన సవరణ చుట్టూనే డిమాండ్లను ఉంచారు. విధుల్లో చేరే సమయంలో ప్రతి సంవత్సరం జీతాలు సవరిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. 2017 నుండి 2022 వరకు తమకు ఎటువంటి వేతన పెరుగుదల లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. దీంతో పాటు ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉన్న వేతనాల చెల్లింపు విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, సీనియారిటీ ఆధారంగా అందరికీ ఒకే రకమైన వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తోన్నారు.
కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ప్రతి నెల 7వ తేదీ లోపల జీతాలు తప్పనిసరిగా చెల్లించాలని అంబులెన్స్ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం పని గంటల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున రోజుకు మూడు షిఫ్టుల పద్ధతిలో అంబులెన్స్ సేవలు నడపాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా పరిహారం అందించాలనే ప్రతిపాదనను కూడా లేఖలో ప్రస్తావించారు.
వీటితో పాటు క్షేత్రస్థాయిలో అంబులెన్స్ సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని అంబులెన్స్ కేంద్రాల పరిధిలో సిబ్బంది కోసం విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. అంబులెన్స్ సేవల సమ్మె కారణంగా అత్యవసర రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహించేది లేదని వర్గాలు స్పష్టం చేశాది. రోగుల ప్రాణాలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications
