వీడియో: రాష్ట్రాలు దాటిన జైపాల్ రెడ్డి అభిమానం: ఆ రాష్ట్ర స్పీకర్ కన్నీరు పెట్టుకున్న వైనం!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్ రెడ్డిపై ఆ పార్టీ నేతల్లో ఉన్న అభిమానం రాష్ట్రాలు దాటింది. జైపాల్ రెడ్డి ఇక లేరనే వార్త తెలుసుకుని కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. విలేకరుల సమావేశంలో ఆయన భోరమని విలపించారు. జైపాల్ రెడ్డి తనకు రాజకీయ గురువు అని నివాళి అర్పించారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయనే కారణమని చెప్పారు. జైపాల్ రెడ్డి సలహాలు, సూచనలతో తాను రాజకీయాల్లోకి ఎదిగానని అన్నారు. చూడ్డానికి రమేష్ కుమార్ కాస్త కఠినంగా కనిపిస్తారు. అలాంటి నాయకుడు కన్నీళ్లు పెట్టుకోవడం విలేకరులను ఆశ్చర్యానికి గురి చేసింది.
జైపాల్ రెడ్డితో 35 సంవత్సరాల అనుబంధం
14 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి ఆదివారం ఉదయం ఆయన బెంగళూరు విధాన సౌధలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావడానికి వచ్చిన రమేష్కుమార్ విషణ్ణవదనంతో కనిపించారు. ప్రెస్మీట్ను ఆరంభించిన వెంటనే- ఆయన జైపాల్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. 35 సంవత్సరాల అనుబంధం ఉందని, జైపాల్ రెడ్డి తనను సోదరుడిగా ఆదరించారని, రాజకీయంలో మెళకువలు నేర్పించారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను తాను ఆయన నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు.
#WATCH Karnataka Assembly Speaker KR Ramesh Kumar breaks down while speaking about senior Congress leader and former Union Minister Jaipal Reddy who passed away earlier today, at the age of 77, in Hyderabad. pic.twitter.com/9mJi7ti76N
— ANI (@ANI) July 28, 2019
అత్యుత్తమ పార్లమెంటేరియన్..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాల్లో ఆయన ఓ ఆణిముత్యంలాంటి వారని రమేష్ కుమార్ అన్నారు. తన గురువు అత్యుత్తమ పార్లమెంటేరియన్ అనే విషయాన్ని తాను చాలామందికి గర్వంగా చెప్పానని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి, గీతా ఛటర్జీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి మహా నాయకులతో పోల్చదగిన వారని అన్నారు. తనపై జైపాల్ రెడ్డి ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించి నాలుగు దశాబ్దాలు గడిచిపోయిందని, తన రాజకీయ జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ జైపాల్ రెడ్డి ముద్ర ఉందని అన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరని చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తాను తన మార్గదర్శకుడిని కోల్పోయానని రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.