బళ్లారి ఎంపీ శ్రీరాములుపై తిరుగుబాటు, కాంగ్రెస్ మంత్రితో బీజేపీ రెబల్ ఎమ్మెల్యే భేటీ!
బెంగళూరు: టిక్కెట్ ఇవ్వలేదని బీజేపీ మీద తిరుగుబాటు చేసిన చిత్రదుర్గ జిల్లా మళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి సోమవారం కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో ప్రత్యక్షం అయ్యారు. బెంగళూరులో సుమారు రెండు గంటల పాటు మంత్రి డీకే. శివకుమార్ తో బీజేపీ రెబల్ ఎమ్మెల్యే తిప్పేస్వామి చర్చించారు.

శ్రీరాములుపై తిరుగుబాటు
చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు నియోజక వర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని బీజేపీ అధిష్టానం బళ్లారీ బీజేపీ ఎంపీ శ్రీరాములకు సూచించింది. మాళకాల్మూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి తీవ్రస్థాయిలో బీజేపీని వ్యతిరేకించి శ్రీరాములు మీద తిరుగుబాటు చేశారు.

నా దెబ్బకు ఇంటికి పోతారు
మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి శ్రీరాములు పోటీ చేస్తే కచ్చితంగా ఓడించి ఇంటికి పంపిస్తానని ఆనియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి ఇప్పటికే చాలెంజ్ చేశారు. నాలుగు రోజుల క్రితం ప్రచారం చెయ్యడానికి వెళ్లిన బళ్లారి ఎంపీ శ్రీరాములను తిప్పేస్వామి అనుచరులు అడ్డుకున్నారు.

చీపుర్లు చెప్పులతో స్వాగతం
మాళకాల్మూరు నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వెళ్లిన శ్రీరాములుకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి మద్దతుదారులు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికారు. దేవాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన శ్రీరాములును అడ్డుకుని ఆయన కారు మీద చెప్పులు, రాళ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు.

టిక్కెట్ ఇచ్చేశారు
చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డాక్టర్ యోగేష్ బాబుకు టిక్కెట్ కేటాయించింది. ఈ సందర్బంలోనే బీజేపీ రెబల్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి మంత్రి డీకే. శివకుమార్ ను కలవడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

శ్రీరాములు ఓటమి లక్ష్యం
బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న బళ్లారి ఎంపీ శ్రీరాములను ఓడించి ఇంటికి పంపించాలని ఎస్. తిప్పేస్వామి నిర్ణయించారు. ఇంతకాలం శ్రీరాములును నమ్ముకుని మోసపోయానని అంటున్న తిప్పేస్వామి ప్రత్యర్థులతో చేతులు కలపడానికి ఇప్పుడు సిద్దం అయ్యారని, అందుకే మంత్రి డీకే. శివకుమార్ తో భేటీ అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications