సిద్దరామయ్యను సీఎం కుర్చీ నుంచి తప్పిస్తారా..!
రాజకీయాలంటేనే అనిశ్చితికి మారుపేరు. పార్టీలు మారడం, పదవుల్లో తేడా రావడం అంతా ఇక్కడ మామూలే. నిన్నటిదాక కొనసాగిన వైభవం తెల్లారేసరికి ఉండకపోవచ్చు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్థ రామయ్య పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే తయారైంది. మొన్నటిదాకా లక్షల విలువ చేసే రిస్ట్ వాచీని ధరించి విపక్షాల చేత విమర్శల పాలైన సిద్ద రామయ్య తాజాగా సొంత పార్టీ ఆగ్రహానికే గురయ్యారు.
సిద్దరామయ్యపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి గల కారణాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్టులను సిద్దరామయ్య తన కుమారుడికి కట్టబెట్టడమే దీనంతటికి కారణంగా కనిపిస్తోంది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ సిద్దరామయ్యపై వేటుకి సిద్దమైనట్టుగా సమాచారం. దీంతో సిద్దరామయ్యకి ఉద్వాసన పలకడం ఖాయమన్న చర్చ కర్ణాటక రాజకీయాల్లో జోరందుకుంది.
సిద్దరామయ్యను పక్కకు తప్పిస్తే ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్.ఎం.కృష్ణ, హోంమంత్రి జి.పరమేశ్వర్ లో ఒకరికి సీఎం పదవి వరించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరిద్దరి పేర్లు కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.