సీఎం ముందే బీజేపీ మంత్రితో కాంగ్రెస్ ఎంపీ బాహాబాహి: క్లారిటీ ఇచ్చిన డీకే
బెంగళూరు: కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో చోటు చేసుకున్న ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్నారాయణ-కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు డీకే సురేష్ మధ్య ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలోనే ఘర్షణ చోటు చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. డీకే సురేష్ చర్యకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై డీకే సురేష్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తెలంగాణలో ఆన్లైన్ ద్వారా తరగతులు: పిటీషన్పై విచారణ వాయిదా
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ విగ్రహాలను బొమ్మై ప్రభుత్వం రామనగరలో నెలకొల్పింది. ఆ విగ్రహాలను ఆవిష్కరించడానికి సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మంత్రి అశ్వథ్ నారాయణ, బెంగళూరు రూరల్ లోక్సభ సభ్యుడు డీకే సురేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. ఈ సభలో అశ్వథ్ నారాయణ చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహానికి గురి చేశాయి.
రాజకీయాలతో సంబంధం లేని సభగా దీన్ని నిర్వహించినప్పటికీ.. అశ్వథ్ నారాయణ మాత్రం.. తమ ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ ప్రసంగించడం, కాంగ్రెస్పై విమర్శలు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చివరికి- ముఖ్యమంత్రి బొమ్మై సైతం జోక్యం చేసుకున్నారు. రాజకీయాలు మాట్లాడొద్దంటూ అశ్వథ్ నారాయణను వారించారు. అయినప్పటికీ- ఆయన పట్టించుకోలేదు. రాజకీయ ప్రసంగాన్ని కొనసాగించారు.
దీనితో వేదిక మీదే ఉన్న డీకే సురేష్.. అక్కడికక్కడే అశ్వథ్ నారాయణతో ఘర్షణకు దిగారు. ఆయన ప్రసంగిస్తోండగానే మైకును లాక్కునే ప్రయత్నం చేశారు. వేదిక మీదే ఉన్న ఇతర కాంగ్రెస్ నాయకులు అశ్వథ్ నారాయణతో వాగ్వివాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా- డీకే సురేష్ వైఖరికి నిరసనగా ఇవ్వాళ బెంగళూరులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆందోళన చేపట్టారు.